సిటీబ్యూరో, జులై 10 ( నమస్తే తెలంగాణ ) :ఆయన పేరు శ్రీనివాస్రావు. రిటైర్డ్ ఎయిర్ ఇండియా ఉద్యోగి. వయసు 70 ఏండ్లు. వెస్ట్మారేడ్పల్లి నివాసి. ఇప్పటికీ సైకిల్పైనే ఆయన ప్రయాణం. కరోనా ఆపత్కాలంలో వయసును మరిచిపోయి.. వైరస్ విజృంభణ వేళలోనూ నిత్యావసర సరుకులు, అత్యవసర మందులను బాధితుల ఇండ్లకు ఉచితంగా చేర్చి.. వారికి అండగా నిలిచారు. బయటకు వెళితే వైరస్ పొంచి ఉంటుందనే భయం.. వృద్ధులు వెళ్లకూడదనే సంకేతాలు.. ఇవేవీ సేవ చేయాలనే నిర్ణయాన్ని ఆపలేదు. వైరస్కు భయపడలేదు. సైకిల్ తొక్కడం చిన్నప్పటి నుంచి అలవాటుగా ఉన్న ఈ పెద్దాయన. బైస్కిల్పై సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
కరోనా సేవలందిస్తున్న ఆర్గనైజేషన్లకు ఫోన్ నంబర్ ఇచ్చిన శ్రీనివాస్రావు. తమ ప్రాంతానికి 20 కిలో మీటర్ల దూరంలో ఎటువంటి డెలివరీ ఉన్నా సేవలు అందిస్తానని మాట ఇచ్చారు. అప్పటి నుంచి నేరుగా తనకు వచ్చే రిక్వెస్ట్ కాల్స్తో పాటు ఆర్గనైజేషన్స్ పంపించే ఆర్డర్స్ను బాధితులకు చేర్చుతూ.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. సమయం ఏదైనా అవసరమున్న వారికి సైకిల్పైనే వెళ్లి సరుకులు, మెడిసిన్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 200 మందికి సేవలందించానని శ్రీనివాస్రావు తెలిపారు. సేవ చేయడంలో తన స్వార్థం కూడా ఉందని.. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యంగా ఉంటానని చెబుతారు.
భౌతికదూరం, మాస్క్ ధరించడం, శానిటైజేషన్ చేసుకోవడం వంటి చర్యలతో కరోనా ను ఎదుర్కొన్నా. సైకిల్ తొక్కడం వల్ల ప్రతి రోజూ నూతనొత్తేజం కలుగుతుంది. హైదరాబాద్ సైక్లిస్ట్లు నిర్వహించే ప్రతీ కార్యక్రమంలో పాల్గొంటా. ప్రస్తుత రోజుల్లో చాలా మంది కనీసం దూరం నడవడానికి కూడా వాహనాన్నే వినియోగిస్తున్నారు. నడవాల్సిన వయసులో యువకులు వాహనాలను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. చిన్నవయసులోనే అనారోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ సైకిల్ వినియోగం పెరగడానికి కృషి చేయాలి. -శ్రీనివాస్రావు, విశ్రాంత ఉద్యోగి