ప్రార్థించే చేతుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అన్న నానుడిని నిజం చేస్తున్నాడు ఓ మానవతావాది. కరోనా బాధితులకు ఆక్సిజన్ అత్యవసరమవుతున్న నేపథ్యంలో ప్రాణవాయువును ఉచితంగా అందించి.. ప్రాణదాతగా నిలుస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని మహమ్మద్నగర్ గ్రామానికి చెందిన హరిజోన్ వ్యాలీ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు మహమ్మద్ ఆసిఫ్. తన తోటి మిత్రులు మురళీగౌడ్, ప్రశాంత్, రాజేందర్, రామస్వామి, చెన్నకేశవులు, శ్రీనుతో కలిసి కష్టకాలంలో మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. ఆక్సిజన్ అవసరమై.. డబ్బులు లేక ఇంటి వద్ద ఇబ్బందులు పడుతున్న వారికి.. ఊపిరి అందించి.. ప్రాణాలు కాపాడుతున్నాడు.
కందుకూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో 20రోజులుగా రూ. 12 లక్షలు ఖర్చు చేసి 100మందికి పైగా ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు కాన్సన్ట్రేటర్లను అందజేశాడు. ఫోన్ చేస్తే చాలు.. సిలిండర్లను సమకూరుస్తూ.. ఇంటి వద్దే ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. బాధితులకు ‘నేనున్నానని.. మీకేంకాదం’టూ.. భరోసా ఇస్తున్నాడు. ఆసిఫ్ సేవాస్ఫూర్తిని పలువురు అభినందిస్తున్నారు.
ఆక్సిజన్ అందక ఎంతో మంది మరణిస్తున్నట్లు తెలిసి చాలా బాధపడ్డాను. ఎంత ఖర్చు అయినా బాధితులకు అండగా నిలువాలనే లక్ష్యంతో 20రోజుల నుంచి 100 మందికి పైగా ఆక్సిజన్ అందించి ప్రాణాలను కాపాడుతున్నా. ఇప్పటికే 12లక్షల వరకు ఖర్చు అయింది. ఆక్సిజన్ కావాలని అనుకున్న బాధితులు సిలిండర్ల కోసం 9666745556, 6281698251, 9391955682 నంబర్లకు ఫోన్ చేయాలి.- మహమ్మద్ ఆసిఫ్ జానీ
నేను కరోనా బారినపడ్డా.. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. డాక్టర్లు డబ్బులు కడితేనే వైద్యశాలలో చేర్చుకుంటామ ని చెప్పారు. ఆ సమయంలో దిక్కుతోచలేదు. స్నేహితుల సలహాతో ఆసిఫ్జానీని సంప్రదిస్తే సి లిండర్లను ఇంటికే పంపారు. ఆక్సిజన్ ఇంటి వద్దే ఏర్పా టు చేసి ప్రాణబిక్ష పెట్డాడు. అతడి సేవలు మరువలేను. – బోదాసు భద్రి, మెదక్పల్లి గ్రామం, తలకొండపల్లి మండలం.
నాకు పాజిటివ్ వచ్చింది. వైద్యశాలలో చేరాను. డిశ్చార్జి అయిన తర్వాత ఇంటి వద్ద ఆక్సిజన్ పెట్టుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆసిఫ్ జానీ ఒక్క రూపాయి తీసుకోకుండా ఇంటి వద్దకే సిలిండర్ను సరఫరా చేశాడు. ఆక్సిజన్ కొరత ఉన్న సమయంలో కరోనా బాధితులను ఆదుకోవడం సంతోషంగా ఉంది.- బొడ్డుపల్లి కృష్ణ, కానిస్టేబుల్, చిప్పలపల్లి గ్రామం, కందుకూరు.