సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : విద్య, ఉద్యోగం కోసం విదేశాల్లో స్థిరపడిన పిల్లలు నగరంలో ఉంటున్న తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారో అని ఆందోళన చెందుతుంటారు. కరోనా సమయం కావడంతో వారి భయం మరింత రెట్టింపవుతున్నది. తల్లిదండ్రులకు కరోనా సోకితే వారిని ఎవరు పట్టించుకుంటారని మదనపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి బాధ్యత చూసుకునేందుకు అన్వయ కంపెనీ ముందుకొచ్చింది. కొవిడ్ నుంచి బాధితులు కోలుకునే వరకు పూర్తి బాధ్యత తీసుకుని అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. కొవిడ్ టెస్ట్ మొదలు 14 రోజుల అనంతరం నెగెటివ్ రిపోర్టు వచ్చే వరకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. అందుకోసం నిరంతరం వైద్యుల పర్యవేక్షణ ఉండేలా టెలిమెడిసిన్ వంటి చర్యలు తీసుకుంటారు. వీరి ఆరోగ్య పరిస్థితిని విదేశాల్లో ఉన్న వారి పిల్లలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ భరోసా ఇస్తున్నారు.
న్యూట్రిషన్ నిపుణుల సూచన, లక్షణాలను బట్టి మెడిసిన్..నిత్యావసర సరుకులు, హోం గార్డ్ కిట్ తదితర సేవలు అన్వయ సిబ్బంది అందిస్తున్నది. పేషెంట్ పరిస్థితిని బట్టి నర్సింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజు పెషెంట్ యోగక్షేమాలు చెక్ చేస్తారు. రోజులో ఒకసారి వైద్యుడు వీడియోకాల్ ద్వారా అందుబాటులో ఉంటారు. అంతేకాదు మానసికంగా దృఢంగా ఉండేలా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ అందించనున్నారు. ఎలాంటి సందేహం ఉన్నా తీర్చేలా 24 గంటలు కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలనుకునే వారికి హోం సర్వీస్ అందిస్తున్నారు. అత్యవసరమయితే వారు కోరుకున్న ఆసుపత్రిలో జాయిన్ చేసే బాధ్యత కూడా వారిదే. కూరగాయల నుంచి మెడిసిన్ వరకు 24 గంటలు అందుబాటులో ఉంటూ ఆత్మీయ బంధువులా అండగా నిలుస్తున్నారు.
తాను కొన్నేళ్ల పాటు విదేశాల్లో ఉండి వచ్చిన. ఇక్కడ ఉండే తల్లిదండ్రుల బాధలు ఎలా ఉంటాయో తెలుసు. విదేశాల్లో ఉన్న వారు తమ కుటుంబాల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందక్కర్లేదు. అన్వయ సేవలు కావాలనుకునే వారికి 24 గంటలు అందుబాటులో ఉంటాం. కొవిడ్ టెస్ట్ నిర్వహణ..పాజిటివ్ వస్తే కొలుకునే వరకు పూర్తి బాధ్యత తీసుకుంటాం.అన్వయ వెబ్సైట్లో మేం అందించే సేవలు అన్నీ ఉంటాయి. ఇప్పటి వరకు 6 వేల వరకు ఆన్లైన్ డాక్టర్ కన్సల్టెన్సీలు జరిగాయి. 1500 వరకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాం. అత్యవసరమైతే అంబులెన్స్లో దవాఖానకు తరలించడం, అవసరమైన వారికి వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాం. – ప్రశాంత్రెడ్డి, ఫౌండర్, అన్వయ సంస్థ