వ్యవసాయ యూనివర్సిటీ , జూలై 10 : దేశ వ్యాప్తంగా చిరు ధాన్యాల పెంపు అవసరమని న్యూఢిల్లీకి చెందిన ఐసీఏఆర్ ఏడీజీ చైర్మన్ డాక్టర్ ఎస్కే ప్రధాన్ అన్నారు. సోమవారం రాజేంద్రనగర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ ఆడిటోరియంలో భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) హైదరాబాద్, ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ చిరుధాన్యాలు -2023 సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశ జనాభాకు అనుగుణంగా 27వేల మెట్రిక్ టన్నుల చిరుధాన్యాల ఉత్పత్తి జరుగుతున్నదని మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం వర్సిటీలు ప్రజలను చైతన్యం చేయడంతో రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు మధ్యప్రదేశ్, కర్ణాటక చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. 2030 వరకు 40 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి ప్రణాళిక అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోద్పూర్కు చెందిన ఐసీఏఆర్- సీఏజెడ్ఆర్ఐ డైరెక్టర్, సమావేశం కో చైర్మన్ డా.ఓపీ యాదవ్, పీజేటీఎస్ఏయూ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా.రఘురామిరెడ్డి, కో కన్వీనర్, ఐఐఎంఆర్ డైరెక్టర్ డా.సి.తారాసత్యవతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలోని పలు రాష్ర్టాల వ్యవసాయ వర్సిటీల నుంచి వచ్చిన ప్రతినిధులు వారి ప్రాంతాల ప్రాముఖ్యత, తీసుకోవాల్సిన అంశాలపట్ల సుధీర్ఘంగా చర్చించారు.
రెండు రోజుల్లో వర్ష సూచన
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా, సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.9 డిగ్రీలు, గాలిలో తేమ 52 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.