GHMC | సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీకి కిరాయి, లీజు చెల్లించకుండా.. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ నగరానికి చెందిన రెండు స్లేటర్ హౌస్ ( slaughter house )ల నిర్వహణ సంస్థ రూ.270 కోట్లు జీహెచ్ఎంసీకి చెల్లించకుండా మోసం చేసిందంటూ జీహెచ్ఎంసీ అధికారులు సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జీహెచ్ఎంసీ 2012లో అంబర్పేట్, న్యూబోయిగూడలోని ఆధునిక కబేళాలకు (స్లేటర్ హౌస్) టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో రూ.19.18 కోట్లకు ఫ్రెష్ ఎన్ ఫ్రోజన్ ఫుడ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మూడేండ్ల పరిమితికి గాను కాంట్రాక్టు దక్కించుకుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు 16 అక్టోబరు 2013లో రెండు వేరువేరు అగ్రిమెంట్లు చేశారు. 30 రోజుల్లో సదరు కాంట్రాక్టు సంస్థ పనులు ప్రారంభించాల్సి ఉన్నా, స్లేటర్ హౌస్లలో పనులు పూర్తిగా కాలేదని, మరమ్మతులు చేయాలని, వివిధ కారణాలు జీహెచ్ఎంసీకి చూపించడంతో, ఆయా పనులను జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి చేసి, 2014, అక్టోబర్లో వారికి అప్పగించారు. దీంతో సదరు కాంట్రాక్టు సంస్థ రెండు స్లేటర్ హౌస్లను తమ అధీనంలోకి తీసుకుంది. అయితే ట్రయల్ రన్లో కొన్ని సమస్యలు రావడంతో వాటి పరిష్కారం కోసం రాంకీ ఎన్విరో ఇంజినీర్ లిమిటెడ్కు కాంట్రాక్టు ఇచ్చి జీహెచ్ఎంసీ అన్ని పనులు పూర్తి చేయించింది. దీంతో జనవరి, 2015లో స్లేటర్ హౌస్లో వాణిజ్య అవసరాల కోసం ఫ్రెస్ ఎన్ ఫ్రోజెన్ పుడ్ టెక్ సంస్థ పనులు ప్రారంభించింది.
2015 నుంచి విదేశాలకు బీఫ్ తరలింపు
ఒక పక్క తమ వ్యాపారం నిర్వహిస్తూనే పక్కా ప్రణాళికతో మరో పక్క ఇంకా చిన్న చిన్న సమస్యలున్నాయంటూ జీహెచ్ఎంసీకి లేఖలు రాస్తూ ఎలాంటి చెల్లింపులు చేయకుండా వాయిదా వేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే అంబర్పేట్ స్లేటర్ హౌస్ నుంచి విదేశాలకు బీఫ్ ఎగుమతిని 2015 మేలో ప్రారంభించింది. ఇందుకు జీహెచ్ఎంసీ వెటర్నరీ జాయింట్ డైరెక్టర్, బయోలాజిక్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ నుంచి లేటర్ కూడా తీసుకున్నారు. ఇలా మే 2015 నుంచి, ఫిబ్రవరి 2019 వరకు 56,765.511 మెట్రిక్ టన్నుల బీఫ్ను అంబర్పేట్ స్లేటర్ హౌస్ నుంచి ఎగుమతి చేశారు. ఈ సందర్భంగా పశువులు వధించక ముందు, వధించిన తరువాత జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారుల నుంచి తీసుకోవాల్సిన సర్టిఫికెట్లను, అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి వాళ్లే తయారు చేశారని జీహెచ్ఎంసీ పోలీసులకు తెలిపింది.
నిబంధనలు పాటించకుండా వధించారు
అంబర్పేట్ హౌస్ నుంచి 3,56,468 గొర్రెలు, 2,20,071 మేకలు, న్యూ బోయిగూడ హౌస్ నుంచి 2,61,965 గొర్రెలు, మేకలు 72,868 పశువులను స్థానిక అవసరాల కోసం వధించారని, ఇలా ఫిబ్రవరి 2015 నుంచి 2020 , నవంబర్ వరకు వరకు భారీ ఎత్తున వ్యాపారం చేసి కోట్ల రూపాయలు ఈ సంస్థ ఆర్జించిందని అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన రాయల్టీలను చెల్లించకుండా రూ. 270.06 కోట్ల నష్టం చేశారంటూ జీహెచ్ఎంసీ, సికింద్రాబాద్ జోన్, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ చక్రపాణి రెడ్డి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.