సిటీబ్యూరో, జూన్19 (నమస్తే తెలంగాణ): కొవిడ్ 19 బారిన కుటుంబ పెద్ద కోల్పోయిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామని స్లేట్ స్కూల్ కరస్పాండెంట్ వాసిరెడ్డి అమర్నాథ్ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు తమ తండ్రులను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థులను శనివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి అమర్నాథ్ మాట్లాడుతూ కరోనా ఫస్ట్, సెకండ్ మూలంగా మొత్తంగా 22 మంది విద్యార్థులు తమ తండ్రులను కోల్పోయారని వాపోయారు. వారెవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. పదో తరగతి పూర్తి చేసేంతవరకూ ఆ విద్యార్థులకు రితిక మెమోరియల్ ఫెలోషిప్ కింద ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఫెలోషిప్ పత్రాలను బాధిత విద్యార్థులకు అందజేశారు.