శామీర్పేట, జూలై 15 : ఈత కోసం శామీర్పేట చెరువులోకి దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అల్వాల్ రిసాలబజార్కు చెందిన శివ అలియాస్ అబ్బాస్(19), శోబిత్(19) తమ చిన్ననాటి స్నేహితుడైన అభిషేక్ జన్మదిన వేడుకల్లో భాగంగా 8 మందితో కలిసి శామీర్పేట చెరువు వద్దకు వెళ్లారు. మద్యం తాగిన తర్వాత ఫొటోల కోసం చెరువు తూము వద్దకు చేరుకున్నారు. అంతలో శివ నాకు ఈత వచ్చు.. ఈతకొడతానని మెట్లు దిగి కింద తూము వద్ద నీటిలోకి దూకాడు. అదే సమయంలో శోభిత్ కూడా తూము పైభాగం నుంచి నీటిలోకి దూకాడు.
వీరిద్దరూ నీటిలో మునిగిపోతుండగా కాపాడేందుకు తోటి స్నేహితులు ప్రయత్నించారు. పెద్దగా కేకలు వేస్తూ సహాయం చేయాలంటూ స్థానికులను కోరారు. స్థానికులు వచ్చే సమయానికి ఇద్దరూ నీట మునిగిపోవడంతో 100, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో వెతుకసాగారు. మృతదేహాలు లభ్యం కాకపోవడంతో చీకటి కారణంగా గాలింపు చర్యలను ముగించారు. ఉదయాన్నే సహాయక చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.