రంగారెడ్డి జిల్లా కోర్టులు, జూలై 27(నమస్తే తెలంగాణ): సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లి వస్తున్న ఒంటరి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు గోల్కొండ రాజ్కుమార్ (50)కు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో న్యాయస్థానం తీర్పునిచ్చింది. ప్రత్యేక పీపీ సునీత బర్ల కథనం ప్రకారం.. సరూర్నగర్లోని పీ అండ్ టీ కాలనీకి చెందిన బాలిక నాలుగో తరగతి చదువుతోంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన బాలికకు తల్లి ఉప్మా రవ్వ తీసుకురమ్మని కిరాణా దుకాణానికి పంపింది. కొద్ది సేపటి తర్వాత ఆ బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది.
అదేప్రాంతంలో ఉండే రాజ్కుమార్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని తన తల్లికి చెప్పింది. జరిగిన ఘటనపై బాలిక తల్లి సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజ్కుమార్ను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. దర్యాప్తు పూర్తిచేసిన పోలీసులు.. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సరూర్నగర్ సీడీఓ చందర్రావు న్యాయస్థానం ముందు సాక్షులను ప్రవేశపెట్టారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బాలిక కుటుంబానికి ఐదు లక్షల ముప్పైవేల పరిహారాన్ని అందజేయాలని న్యాయసేవా సంస్థను న్యాయస్థానం ఆదేశించింది.