చార్మినార్, నవంబర్ 2: వృత్తి విద్యా కోర్సులను అందిస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్న సెట్విన్ ఆధ్వర్యంలో సరికొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నామని సెట్విన్ డైరెక్టర్ కె.వేణుగోపాల్రావు తెలిపారు. సెట్విన్ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సెట్విన్ నేటి అధునిక కాలానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను మరింత విస్తృతం చేస్తూ కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. కొత్త కోర్సులను ఆన్లైన్ ద్వారా అందిస్తూ మరింత మంది విద్యార్థులకు చేరువ కావడానికి ప్రయత్నిస్తుందన్నారు. అందులో భాగంగానే ఈ ఆన్లైన్ కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. మూడు, ఆరు నెలల కాల వ్యవధి గల 25 కోర్సులను అందిస్తున్నామని తెలిపారు. ఇందులో ఫైథాన్, ఏఐ అండ్ ఎంఎల్తో పాటు సివిల్ ఆటోకాడ్, డాట్నెట్, రోబోటిక్ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మూడు, ఆరు నెలల కాల వ్యవధి గల కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సెట్విన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లను అందిస్తామని తెలిపారు. ఈ కోర్సులకు ప్రవేశాలు సైతం ఆన్లైన్లోనే కొనసాగునున్నాయని సెట్విన్ డైరెక్టర్ వేణుగోపాల్రావు తెలిపారు.