సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ స్థాయి ప్రమాణాలు, హైటెక్ హంగులు, ఆధునిక వసతులు, ఆకర్షణీయమైన రూపురేఖలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ఊపందుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం స్టేషన్ అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. స్టేషన్ అభివృద్ధి కోసం రైల్వే బోర్డు రూ.699 కోట్లు కేటాయించిందన్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను గిర్దారిలాల్ కన్స్ట్రక్షన్ ప్రైవేటు లిమిటెడ్కు అప్పగించామన్నారు. నిర్మాణ బాధ్యతలలో భాగంగా 2025 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిర్ణీత గడువు లోగా స్టేషన్ పునర్నిర్మాణానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో ఇప్పటికే పలు రకాల పనులు ప్రారంభమయ్యాయన్నారు. మొదటి దశలో డిజైన్కు సంబంధించిన రూపకల్పన పనులను ఖరారు చేయడానికి లీడ్ డిజైన్ డైరెక్టర్, సేఫ్టీ కన్సల్టెంట్తో పాటు ప్రూఫ్ కన్సల్టెంట్ను నియమించినట్లు తెలిపారు. ఈ భవనం నిర్మాణానికి సంబంధించిన రూపకల్పనకు తుది మెరుగులు దిద్దడం కోసం ఐఐటీ ఢిల్లీని ప్రూఫ్ కన్సల్టెంట్గా నియమించినట్లు పేర్కొన్నారు.
ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, పర్యవేక్షించడం కోసం సికింద్రాబాద్ స్టేషన్ పరిధిలోనే సైట్ ఆఫీస్తో పాటు సైట్ లేబొరేటరీని ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికుల కోసం సకల సౌకర్యాలతో స్టేషన్ను పునర్మిస్తున్నట్లు జీఎం అరుణ్కుమార్ జైన్ తెలిపారు.