సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నం వరకు ఈ నెల 15న కొత్తగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. దీంతో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే అంశంపై దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు మంగళవారం ఎస్సీఆర్ జీఎం అరుణ్కుమార్ జైన్ సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తాతో కలిసి వందేభారత్ రైలులో విజయవాడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణం చేయడంతో పాటు రైలు ప్రయాణికులతో ముచ్చటించారు. ఈ మేరకు వందేభారత్ రైలు ప్రయాణికులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న సిబ్బందితో సమావేశమై రైలు భద్రతకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.