సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వైరస్ను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించింది. బుధవారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా నియమాలు, విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై ఇప్పటికే విద్యాధికారులు పలు మార్లు విద్యాసంస్థల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు 2800, రంగారెడ్డి జిల్లా పరిధిలో 2693, మేడ్చల్ జిల్లా పరిధిలో 1896 ఉన్నాయి. ప్రతి పాఠశాలలో శానిటైజేషన్ స్టాండ్లు, జ్వర నిర్ధారణ చేసే డిజిటల్ థర్మామీటర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత జిల్లా విద్యాధికారులకు సూచనలు జారీ చేశారు. పాఠశాలల్లోని తరగతి గదులు, ఉపాధ్యాయులకు సంబంధించిన స్టాఫ్రూమ్, డైనింగ్ హాల్తో పాటు విద్యార్థుల ట్రాన్స్పోర్ట్కు వినియోగించే బస్సులు, వ్యాన్లు తదితర వాహనాలను సైతం ద్రావకాలతో ప్రతిరోజు శానిటైజ్ చేసే విధంగా సూచనలు జారీ చేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
ప్రతి తరగతి గదిలో 20మందికి మించి విద్యార్థులు ఉండకుండా చూడాలని విద్యాధికారులకు సూచనలు జారీ చేసినట్లు రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. భోజన విరామ సమయంలో విద్యార్థులు చేతులను శుభ్రం చేసుకునే విధంగా, ఒకేదగ్గర గుమిగూడి, టిఫిన్లను షేర్ చేసుకోకుండా.. కరోనా నియమాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ వైద్యాధికారులు నగరంలోని విద్యా సంస్థలకు సూచనలు జారీచేశారు.
విద్యార్థులు లేదా పాఠశాలలోని సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించినా లేదా అనుమానిత లక్షణాలున్నా వెంటనే వారిని ఐసోలేషన్కు తరలించాలి. ఎక్కడైనా అనుమానితులు, లక్షణాలున్నట్లు సమాచారం అందితే వెంటనే ఆరోగ్య సిబ్బంది వారి వద్దకే వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్గా నిర్ధారణ జరిగితే సదరు పాఠశాలలో ఇతర విద్యార్థులకు సైతం పరీక్షలు నిర్వహిస్తాం. ఎవరికైనా పాజిటివ్గా నిర్ధారణ జరిగితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అవసరమైన మందుల కిట్లను అందించి మెరుగైన చికిత్స అందిస్తాం. జాగ్రతలు మాత్రం తప్పనిసరి పాటించాలి. – డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, రంగారెడ్డి జిల్లా