శరీరంలో అన్ని అవయవాలు పనిచేసి, ఒక కన్ను పనిచేయకపోతే వారి జీవితమే అంధకారమవుతుంది. అంతటి ప్రాధాన్యమైన కంటి చూపు మనుషులకు అత్యంత అవసరం. వివిధ కారణాలు, ప్రమాదాల వల్ల కంటిచూపు కోల్పోయిన, దృష్టి మందగించిన వారి జీవితాల్లో ‘సరోజినీదేవి కంటి దవాఖాన’ వెలుగులు నింపుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడంతో కార్పొరేట్కు ధీటుగా మెరుగైన వైద్య చికిత్సలు అందజేస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు రోజుకు 60మందికి పైగా.. నెలకు సుమారు 2వేల మంది రోగులకు కంటిచూపును ప్రసాదిస్తున్నదీ.. దవాఖాన.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో సరైన వసతులు లేక ఇక్కడికి రావాలంటేనే రోగులు భయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెరుగైన మౌలిక వసతులు, అధునాతన వైద్య పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో వైద్య పరీక్షల నిమిత్తం క్యూ కడుతున్నారు. కార్పొరేట్లో ఓపీ కోసం వెళితే రూ.వేలు, ఆపరేషన్ అంటే లక్షలు వసూలు చేస్తున్నారు. దీంతో కార్పొరేట్ దవాఖానలకు వెళ్లే స్థోమత లేని నిరుపేదలు, మధ్యతరగతి వారు, సంపన్న వర్గాల ప్రజలు సైతం పూర్తి ఉచితంగా ఓపీ సేవలు, ఆపరేషన్లు నిర్వహిస్తున్న సరోజినీ దేవి కంటి దవాఖానను ఆశ్రయిస్తున్నారు. ఉస్మానియా వైద్యకళాశాల పరిధిలో కొనసాగుతున్న ఈ దవాఖానలో సాధారణ చికిత్స నుంచి శస్త్రచికిత్సల వరకు అన్ని వైద్యసేవలు ఉచితంగా అందజేస్తున్నారు. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ర్టాల నుంచి కూడా రోగులు సరోజినీని ఆశ్రస్తూ కంటిచూపును పొందుతున్నారు.
సరోజినీదేవి కంటి దవాఖానలో కార్పొరేట్కు ధీటుగా వైద్యసేవలు అందిస్తున్నాం. దవాఖానలో ఉన్న ఐదు ఆపరేషన్ థియేటర్లలో ప్రతి రోజు 60కి పైగా సర్జరీలు జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం తక్కువ సంఖ్యలో శస్త్రచికిత్సలు చేస్తున్నాం. సాధారణంగా నెలలో 10 కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలు చేపడుతున్నాం. కరోనా కారణంగా కార్నియా దాతలు ముందుకురావడం లేదు. రెటీనా సర్జరీ, స్కీన్ కరెక్షన్ వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేస్తున్నాం. వీటికి కార్పొరేట్లో లక్షల రూపాయలు ఖర్చవుతాయి. లేజర్ సర్జరీల ద్వారా ఉచితంగా లెన్స్ను వేస్తున్నాం. గతంలో ఈ లెన్స్ను బయటి నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉచితంగా వేస్తు న్నాం. ముఖ్యంగా కంటిలోని రెటీనాను పరీక్షించేందుకు ఓసీటీ(ఆక్టోలాక్ కంప్యూటరైజ్డ్) యంత్రం, చిన్నపిల్లల కోసం రూ.75లక్షల విలువైన ‘రీట్ క్యామ్’, కార్నియల్ టోఫోగ్రఫీ వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
555 పడకల సామర్ధ్యం గల సరోజినీదేవి కంటి దవాఖానకు ప్రతిరోజు వెయ్యి మంది వరకు బయటిరోగులు (ఓపీ) వస్తుంటారు. పడకల సామర్ధ్యాన్ని మించి రోగులు వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో ప్రస్తుతం ఓపీ కేసులు 500వరకు వస్తున్నాయి. ఓపీ విభాగంలో వైద్య పరీక్షలు చేయించుకుని, చికిత్స పొందిన రోగుల అవసరాన్ని బట్టి దవాఖానలో చేర్చుకుంటారు. ప్రతిరోజు 60నుంచి 70వరకు ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం తెలిపారు.