సిటీబ్యూరో, జనవరి 14 ( నమస్తే తెలంగాణ ): సంక్రాంతిని దేశవ్యాప్తంగా అనేక పేర్లతో ప్రజలు సంబురాలు జరుపుకొంటారు. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టగానే తొలుత వచ్చే అతిపెద్ద పండుగ ఇదే. ముత్యాల ముగ్గులు, పతంగులతో సాంప్రదాయం ఉట్టిపడుతుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని నిర్వహిస్తే.. అన్ని చోట్ల ప్రకృతితో మమేకమైన పండుగనే. కాగా, మహానగరంలో ఇంటింటా సంక్రాంతి శోభ సంతరించుకున్నది. షాపింగ్ మాల్స్, వస్త్రదుకాణాలు సందడిగా కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ర్టాల్లో..
సంక్రాంతి వేళ.. పల్లెల్లో తెలుగు లోగిళ్లు కళకళలాడుతుంటే.. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, సన్నాయి మేళాలు, కోలాటాలతో కాలనీలన్నీ మైమర్చిపోతాయి. నగరంలో సంక్రాంతి కళ వెల్లివిరిసింది. ఆకాశమంత పతంగుల సందడి కనిపిస్తున్నది.
వేర్వేరు రాష్ర్టాల్లో..
మహారాష్ట్రలో తిల సంక్రాంతిగా ప్రజలు సాంప్రదాయబద్ధంగా పాటిస్తారు. నువ్వల లడ్డు తినాలని భావిస్తారు. చనిపోయిన పెద్దలు పుణ్యలోకాలకు వెళ్లాలంటూ తర్పణాలు విడుస్తారు. ఈ కారణంతో దీనిని పెద్దల పండుగగా వ్యవహరిస్తారు.
పంజాబీలు మాఘీ సంక్రాంతిగా పిలుస్తారు. ముందురోజు భోగి వేడుకను లోహ్రీగా జరుపుకొంటారు. కేవలం మతపరమైన వేడుకగానే కాకుండా సాంస్కృతిక సంబురంగా భావిస్తారు. సాంప్రదాయ ఆహారం ఖీర్ను తీసుకోంటారు. బాంగ్రా నృత్యం చేస్తూ సరదాగా గడుపుతారు.
తమిళనాడులో ఘనంగా చేసుకునే పండుగల్లో పొంగల్ ముఖ్యం. పశుపక్షాదులు, ప్రకృతిని పూజిస్తారు. సంక్రాంతి నాడు సూర్యుడికి పూజలు చేస్తారు.
కర్ణాటకలో సంక్రాంతి పండుగను సుగ్గీ అని పిలుస్తారు. అక్కడ మహిళలు రైతుల పండుగగా ఘనంగా నిర్వహిస్తారు. మహిళలు ఇంటింటికీ వెళ్లి బెల్లం, నువ్వలు, శెనగలు, చెరకు ముక్కలు పంచి పెడతారు.
కేరళ నాట మకర విళక్కు పేరిట ఘనంగా వేడుక చేస్తారు. శబరిమలైలో కొలువుదీరిన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అదే రోజు భక్తులు బారులు తీరుతుంటారు.
ఉత్తర్ప్రదేశ్లో సంక్రాంతిని కిచేరి పేరిట వైభవంగా నిర్వహిస్తారు. త్రివేణి సంగమం వద్ద పవిత్రస్నానాలు చేసేందుకు భారీగా భక్తులు చేరుతారు.
గుజరాత్లో ఉత్తరాయణ్ పేరిట ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఏటా జనవరి 7 నుంచి 15 వరకు అంతర్జాతీయ స్థాయిలో పతంగుల పోటీలను నిర్వహిస్తారు.
తెలుగుదనం ఉట్టిపడుతుంది..
సంక్రాంతి పండుగ అనగానే తెలుగు సాంప్రదాయం ఉట్టిపడుతుంది. దేశవ్యాప్తంగా సంక్రాంతిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా జరుపుకొన్నప్పటికీ ఆచార వ్యవహారాలను కాపాడడమే లక్ష్యంగా ఉంటుంది. తెలుగు రాష్ర్టాల్లో అయితే వాకిళ్లు ముగ్గులతో కళకళలాడుతాయి.
-విశ్వైక, ప్రముఖ కవయిత్రి, అక్షరయాన్ సభ్యురాలు
గొబ్బెమ్మలను గుమ్మడిపూలతో..
ఆవుపేడతో సాంప్రదాయంగా తయారు చేసే గొబ్బెమ్మలను గుమ్మడిపూలతో అలంకరించి, పసుపు, కుంకుమతో పూజించడం ఆచారం. ఇంటి గడపలను శుద్ధి చేసి.. పసుపు పూసి గొబ్బెమ్మలను పెట్టి..వాటిపై రేగిపండ్లు వేస్తారు.
-దుర్గ కల్యాణి, జగతి ఫౌండేషన్ అధ్యక్షురాలు