సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ మరింత పకడ్బందీగా చేపట్టనున్నారు. నగరం దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఇప్పటికే స్వచ్ఛ ఆటోల పనితీరుపై డివిజన్లలోని కాలనీ, బస్తీల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తనిఖీలకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా కమిషనర్ లోకేశ్కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్య వైద్యాధికారి, ముగ్గురు జాయింట్ కమిషనర్లు (జేసీ), సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ),ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) ఈ కమిటీ బృందంలో ఉన్నారు.
గ్రేటర్లో 6,500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నది. 4,450 టన్నుల చెత్తను స్వచ్ఛ ఆటోలు, పలు ట్రక్కుల ద్వారా ఇండ్ల నుంచి సేకరిస్తున్నాయి. కానీ కొందరు స్వచ్ఛ ఆటో డ్రైవరు రోజూ విధుల్లో పాల్గొనడం లేదు. దీంతో గృహస్తులు ఇంటి వ్యర్థాలను రోడ్లపైకి తెచ్చి పడేస్తున్నారు. ఇలా వేసిన చెత్తను పోగు చేసి వాహనాల ద్వారా జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. విధానపరమైన లోపాలు, స్వచ్ఛ ఆటోల పనితీరులో నిర్లక్ష్యం కారణంగా పారిశుధ్యం నిర్వహణపై విపరీతమైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ 8 మంది అధికారులతో ప్రత్యేక కమిటీని వేశారు. రోజూ ఉదయం ఆరు గంటలకు వీరందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి తగు చర్యలు చేపట్టనున్నారు. వారంలో మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించనున్నారు.