అతను ఆకలి బాధ తెలిసిన మనిషి..చిన్నప్పుడే తండ్రి మరణించడంతో తన తల్లి అతనికి భోజనం పెట్టేందుకు పడ్డ కష్టాన్ని కల్లారా చూశాడు. అప్పుడే నిర్ణయించుకున్నాడు ఇలాంటి క్షుద్బాధతో ఇంకెవ్వరూ దిగులు పడొద్దని. ఓ రోజు డబీర్పుర రైల్వే స్టేషన్ వద్ద 70 ఏండ్ల వృద్ధురాలు ఆకలితో అలమటిస్తుండగా హోటల్ నుంచి భోజనం తెచ్చి ఆయనే స్వయంగా ఆమెకు తినిపించాడు. అప్పుడు ఆమె కండ్లల్లో ఆనందం చూసి తుదిశ్వాస వరకు సేవే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకొని సాని ఫౌండేషన్ ద్వారా నగరంతో పాటు పలు రాష్ర్టాల్లో అన్నార్తుల ఆకలితీరుస్తున్నాడు. అతని సేవలు మెచ్చిన బ్రిటన్ ప్రభుత్వం యూకే కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డును ప్రకటించింది. అతనే మన ఓల్డ్ సిటీ డబీర్పురకు చెందిన అజహర్ మక్సూసీని.
ఓల్డ్ సిటీ డబీర్పురకు చెందిన సయ్యద్ ఉస్మాన్ అజర్ మక్సూసీకి తన నాలుగో ఏట తండ్రి మరణించడంతో జీవితంలో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. తల్లి నూర్భాన్ అతనికి భోజనం పెట్టేందుకు పడిన కష్టాలు ఎన్నో చూశాడు. రోజూ ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేందుకు రోజుల తరబడి ఎదరు చూసిన రోజులు ఉన్నాయి. అప్పుడే మొదటిసారిగా ఆకలి విలువేమిటో, కష్టాలేంటో అవగతం చేసుకున్నాడు. ఓ రోజు వృద్ధురాలు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి చూసి హోటల్ నుంచి తానే భోజనం తెచ్చి ఆమెకు తినిపించాడు. మరుసటి రోజు నుంచే అన్నార్తుల ఆకలి తీర్చాలని నిర్ణయించుకొని అతని భార్య తాజ్కు విషయం చెప్పడంతో ఆమె సైతం ఒప్పుకొని ఆయన వెన్ను తట్టింది.అలా ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం 12 ఏండ్లుగా ముందుకు సాగుతూనే ఉంది. మొదటి ఆరు నెలలు ఖర్చులు భారం వెంటాడింది. కొన్నిసార్లు ఇంట్లోని వస్తువులను అమ్మేసి అన్నార్తుల ఆకలి తీర్చిన ఘటనలు ఉన్నాయి.
జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న పలువురితో ఆజ్ కి రాత్ హై జిందగి పేరుతో జాతీయ చానళ్లలో బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్తో ఇంటర్వ్యూ సాగింది. అప్పటి వరకు అతను చేస్తున్న సేవా కార్యక్రమం జాతీయ స్థాయిలో ప్రసారం కావడంతో అనేక రాష్ర్టాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఆ షో చూసిన అతని స్నేహితులు, బంధువులు ఒక్కొరు ముందుకు వచ్చి సహాయసహకారాలు అందించడం ప్రారంభించారు. అమితాబచ్చన్తో సాగిన ఆ ప్రత్యేక కార్యక్రమం వల్లే సాని ఫౌండేషన్ ఆధ్వర్యం లో అతను ఈ సేవలను ఐదు రాష్ర్ర్టాల్లో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో డబీర్పురతో పాటు నాచారం, ముషీరాబాద్, గాంధీ దవాఖాన వద్ద అన్నార్తుల ఆకలిని తీర్చేందుకు ప్రతి రోజూ 1600 మంది వరకు భోజనాలు అందిస్తూ వారి ఆకలిని తీరుస్తున్నారు. నగరంతో పాటు జార్ఖండ్, ఒడిశా, అసోం, కర్నాటక రాష్ర్టాల్లోనూ అన్నార్తుల ఆకలి తీర్చేందుకు సేవా కార్యక్రమాలను వలంటీర్ల ద్వారా కొనసాగిస్తున్నారు.
సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిన యూకే కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు మరింత బాధ్యతను పెంచింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా అనేక రాష్ర్టాలతో పాటు దుబాయ్లోనూ పలు అవార్డులు అందుకున్నాను. బ్రిట న్ ప్రభుత్వం ప్రకటించిన అవార్డులో నాతో పాటు జాతీయ జెండాను ప్రదర్శిస్తూ వెబ్సైట్లో ప్రచురించారు. నాతో పాటు దేశ జెం డాను ప్రసారం చేయ డంతో ఉద్విగ్నతకు లోనై కళ్లు చెమర్చాను.తుది శ్వాస వరకు అన్నార్తుల ఆకలిని తీరుస్తూ వారిలో సంతోషాన్ని వెతుక్కుంటూనే ఉంటాను. సయ్యద్ ఉస్మాన్ అజర్ మక్సూసీ