మియాపూర్లోని ఎఫ్సీఐ కాలనీకి చెందిన కొందరు చిన్నారులు ఆరోగ్య రక్షణ.. పర్యావరణ పరిరక్షణతో పాటు సేవా స్ఫూర్తిని చాటేందుకు ముందుకొచ్చారు. రీసైకిల్డ్ ప్లాస్టిక్ను సేకరించి.. విక్రయిస్తే వచ్చిన డబ్బులకు కొంత జోడించి.. మొత్తం రూ.35వేలతో కాలనీ పార్కులో జిమ్ పరికరాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు తోటి స్నేహితుల నుంచి వెయ్యికిపైగా పాత పుస్తకాలను సేకరించారు. వాటిని నల్లమల అటవీ ప్రాంతంలో సర్కారు స్కూళ్లలో చదివే పేద విద్యార్థులకు అందజేయనున్నారు. చిత్రంలో సేకరించిన పుస్తకాలను తరగతుల వారీగా విభజిస్తున్న విద్యార్థులు.
మియాపూర్, 26 : పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్య సంరక్షణకు ఆ చిన్నారులు నడుం బిగించారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీని చిరుతిండ్ల కోసం వినియోగించే చిన్నారులకు భిన్నంగా..సొంతంగా పర్యావరణ హితమైన పనితో డబ్బులు పోగు చేసి..నలుగురికి ఉపయోగపడే పని చేశారు. చిట్టి చేతులతో గట్టి మేలు తలపెట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాల విద్య అభ్యసనలో భాగంగా వేసవి సెలవుల్లో ఇచ్చిన ప్రాజెక్టుకు గాను రీసైకిల్ ప్లాస్టిక్ సేకరణతో పాటు విక్రయంతో వచ్చిన మొత్తంతో కాలనీలోని పార్కులో జిమ్ పరికరాలను చిన్నారులు ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర పాటు ఈ ప్రక్రియను చేపట్టిన చిన్నారులు రూ.25 వేలను తమ స్వశక్తితో పోగు చేసి తల్లిదండ్రుల తోడ్పాటు తీసుకుని రూ.35 వేలు వెచ్చించి అందరికీ ఉపయోగపడేలా వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేశారు. వాటిని విప్ గాంధీ నేడు ప్రారంభించనున్నారు.
మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్సీఐ కాలనీకి చెందిన పుట్టి నితీశ్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. పర్యావరణానికి హాని కలిగేలా రహదారులపై పడేస్తున్న ప్లాస్టిక్ను రీసైకిల్ దిశగా వినియోగించాలని భావించాడు. కాలనీకి చెందిన పలు పాఠశాల్లో 2 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు అభ్యసిస్తున్న ఖ్యాతి పుట్టి, నెక్కలపూడి సాన్వి, సుదీప్తి, సాయి కౌశిక్, మీనాక్షి, సుశ్రీత, వీర ఆదిత్య, భువనేశ్వర్కుమార్, వేదశ్రీ, సుమంత్, అద్వైత, సుధకుమార్తో కలిసి కాలుష్య రహిత క్రతువులో భాగస్వాములయ్యారు. పాఠశాలల నుంచి ఇంటికి చేరిన అనంతరం తాము నివసించే ఆవాస పరిసరాలలో ఇంటింటికీ వెళ్లి రీసైకిల్డ్ ప్లాస్టిక్ను ఏడాదిన్నర పాటు సేకరించారు. నెలవారీగా విక్రయిస్తూ వచ్చిన మొత్తాన్ని భద్ర పరుచుకున్నారు. ఇలా ఏడాదిన్నర పాటు రీసైకిల్డ్ ప్లాస్టిక్ను వినియోగించి రూ. 25 వేలను పోగు చేశారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల చేయూతతో ఆ మొత్తాన్ని రూ. 35 వేలు చేశారు. ఇలా పోగు చేసిన మొత్తం నిధులతో మియాపూర్ డివిజన్ ఎఫ్సీఐ కాలనీలోని పార్కులో డ్యూయల్ స్కై స్టెప్పర్ జిమ్ పరికరాన్ని స్వయంగా కొనుగోలు చేశారు. శ్రమదానంలో పాల్గొని ఆ పరికరాన్ని పార్కులో బిగించారు. పుట్ట నితీశ్ నేతృత్వంలో చిన్నారులు తమ శక్తికి మించిన సామాజిక, పర్యావరణ క్రతువులో భాగస్వాములై తోటి వారందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
పర్యావరణ హితం కోసమే కాకుండా..వారంతా పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. తమతో పాటు తోటి విద్యార్థుల వద్ద నిరుపయోగంగా ఉన్న పలు తరగతులకు చెందిన 1000 కి పైగా పుస్తకాలను విద్యార్థుల బృందం సేకరించింది. వాటిని ఇప్పటికే తరగతుల వారీగా విభజన చేశారు. ఈ వేసవి సెలవుల్లోనే నల్లమల అటవీ ప్రాంతాలలో నివసిస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే పేద పిల్లలకు అందించేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం వేళలో ఈ విద్యార్థుల బృందం ఓ వైపు రీ సైకిల్ ప్లాస్టిక్ వస్తువులను సేకరిస్తూనే మరోవైపు తమ తోటి మిత్రుల నుంచి పాత పుస్తకాలను సైతం సేకరించి భద్ర పరుచుకున్నారు. ఇలా వెయ్యికి పైగా పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేశారు. చిన్నారులు పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషితో పాటు పేద విద్యార్థులకు ఉచితంగా పాఠ్య, నోటు పుస్తకాలను అందించేందుకు చేస్తున్న ఆలోచనలను పలువురు అభినందిస్తున్నారు.
పర్యావరణానికి హాని కలిగించేలా కాకుండా ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేయాలని మా కాలనీలో ఓ పది మంది చిన్నారులం నిర్ణయించుకున్నాం. ఇందుకోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి సలహాలను తీసుకున్నాం. చదువుకుంటూనే ఏడాదిన్నర పాటు మేము నివసించే కాలనీలో ఇంటింటికీ తిరిగి ప్లాస్టిక్ వ్యర్థాలను, బాటిళ్లను సేకరించాం. వాటిని విక్రయించటం ద్వారా రూ.25 వేల నగదును సమకూర్చుకున్నాం. మరికొందరి తోడ్పాటుతో రూ. 35 వేలకు చేరుకుని ఆ మొత్తంతో కాలనీలోని పార్కులో జిమ్ పరికరాన్ని కొనుగోలు చేశాం. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రతి ఒక్కరం తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నదే మా విన్నపం.
– పుట్ట నితీశ్, బృందం సారథి