పండుగలా ‘నమస్తే తెలంగాణ-ములుకనూరు ప్రజా గ్రంథాలయ’
కథల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం
రచయితల్లో స్ఫూర్తినింపిన కార్యక్రమం
పుస్తకం లేని ఇల్లు అంధకారమే : కవి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్
మరింత సహకారం అందిస్తా : మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు
పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగం : హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్
కథలు సామాజిక అంశాలను స్పృశిస్తాయి : జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్
నింపింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, కవి దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే సతీశ్బాబు తదితరుల చేతులమీదుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రత్యేక బహుమతులు అందుకొని మురిసిపోయారు. ఎక్కడా లేని విధంగా ములుకనూరు వంటి ఒక గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం అభినందనీయమని, ఈ కథల పోటీల ద్వారా నేటి తరానికీ రచనల పట్ల ఆసక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
హనుమకొండ సబర్బన్/భీమదేవరపల్లి, జూన్ 26 : నమస్తే తెలంగాణ-ములుకనూరు ప్రజా గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీల బహుమతుల ప్రదాన కార్యక్రమం పండుగలా సాగింది. సీఎం కార్యాలయ ఓఎస్డీ, కథా రచయిత, ప్రముఖ వాగ్గేయకారుడు దేశపతి శ్రీనివాస్, మాజీ ఎంపీ కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, హనుమకొండ జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్, రిజిస్ర్టేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ వేముల శ్రీనివాసులు, నమస్తే తెలంగాణ చీఫ్ ఆఫ్ బ్యూరో ఓరుగంటి సతీశ్, ఫీచర్స్, మ్యాగజైన్స్ ఎడిటర్ కరణం జనార్దన్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కందివనం స్ఫూర్తి రాసిన డిమ్కి కథకు మొదటి బహుమతి, చందు తులసి రాసిన మోదుగు పువ్వు, నస్రీన్ఖాన్ రాసిన దిశ మార్చుకున్న గాలికి ద్వితీయ బహుమతులు, నెల్లుట్ల రమాదేవి రచించిన పొద్దుగుంకక ముందే, మరీదు వేణు రాసిన కాటుక కన్నుల సాక్షిగా, జైనీ ప్రభాకర్ రాసిన బోన్గిరి టూ లష్కర్ కథలకు తృతీయ బహుమతులు వచ్చాయి. అలాగే 10 మందికి ప్రత్యేక బహుమతులు, ఆరుగురికి రూ.5వేలు, మరో 10మందికి రూ.2వేలు, 28మందికి రూ.1000ల నగదు, నలుగురికి విశిష్ట బహుమతులను అతిథులు అందజేశారు.
పుస్తకం లేని ఇల్లు అంధకారం
– కవి, వాగ్గేయకారుడు దేశపతి శ్రీనివాస్
పుస్తకం లేని ఇల్లు అంధకారం వంటిది. ఎందరో మహనీయులు రచించిన గ్రంథాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది. అమెరికాలో గ్రంథాలయాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అలాగే పూర్వ గ్రంథాలను రక్షించడంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. గ్రంథాలయానికి వెళ్లి మనకు కావాల్సిన పుస్తకం గురించి అడిగినప్పుడు అది లేకపోతే ఆ గ్రంథపాలకుడు నామోషీగా ఫీలవుతాడు. అలాంటి పరిస్థితి మన దగ్గర కూడా రావాలి. అక్కడ బస్టాపుల్లో కూడా పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు రైళ్లలో, బస్సుల్లో ప్రయాణ సమయాల్లో కూడా సెల్ఫోన్లతో కాలం గడుపుతున్నారు. ఇది మంచిపద్ధతి కాదు. అమెరికాలో డొమెస్టిక్ ఫ్లైట్స్లో ప్రయాణించేవారు కూడా పుస్తక పఠనంలో మునిగితేలుతారు. అమెరికాను సందర్శించే మన నాయకులు కేవలం అక్కడి బంగ్లాలనే కాకుండా గ్రంథాలయాలను కూడా సందర్శిస్తే బాగుంటుంది. ఇజ్రాయిల్ దేశం ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రంథాన్ని తమ భాషలోకి తర్జుమా చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. ప్రతి వ్యక్తి నెహ్రూ రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని చదివితే ప్రపంచం కనపడుతుంది. ప్రతి రచయిత రాసే ఒక్కో అక్షరం సమాజాభివృద్ధికి దోహదపడుతుంది. ప్రతి కథ సమాజాన్ని ముందుండి నడిపిస్తుంది. కథ మనిషిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతుంది. నమస్తే తెలంగాణ, ములుకనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా ఇంత పెద్ద సాహితీ పండుగను గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం సంతోషంగా ఉంది. ఇంత పెద్ద గ్రంథాలయాన్ని ఇక్కడ ఏర్పాటుచేసి విజయవంతంగా నిర్వహిస్తున్న తీరు అభినందనీయం.
కొత్తతరానికి ఆసక్తి పెరుగుతుంది..
ములుకనూరు ప్రజాగ్రంథాలయం ఏర్పాటులో నేను కొంతమేర భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. నేను గతంలో ఇచ్చిన హామీలు కొన్ని మిగిలిపోయినప్పటికీ పదవిలో లేకున్నా ప్రస్తుత ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని పనులు పూర్తయ్యేందుకు కృషి చేస్తా. ఒకప్పుడు సాహితీ కార్యక్రమాలన్ని విద్యార్థులే నిర్వహించేవారు. ప్రతి కాలేజీలో సాహిత్య అంశాలు పెద్ద ఎత్తున నడిచేవి. ప్రస్తుతం అవి లేకపోవడం విచారకరం. కథల ద్వారా పూర్వపు జీవనవిధానం నేటితరానికి తెలుస్తుంది. నమస్తే తెలంగాణ, ములుకనూరు ప్రజాగ్రంథాలయం కలిసి ఇంతమంది రచయితలను సమీకరించడం శుభపరిణామం. ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తే కొత్త తరం యువకులకు కూడా రచనల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
– రాజ్యసభ మాజీ సభ్యుడు లక్ష్మీకాంతారావు
కందివనం స్ఫూర్తికి ప్రథమ బహుమతి అందజేస్తున్న కెప్టెన్, ఎమ్మెల్యే సతీశ్కుమార్
పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగం
ప్రస్తుతం ప్రభుత్వం 90వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో 10వేల కాంట్రాక్టు ఉద్యోగాలు మినహాయిస్తే మిగతావన్ని పోటీ పరీక్షలతోనే భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ కావడానికి ములుకనూరు ప్రజాగ్రంథాలయం కీలకపాత్ర పోషిస్తుంది. ఇక్కడి నిర్వాహకులు 20వేల పుస్తకాలు అందుబాటులో ఉంచడం శుభపరిణామం. నిరుద్యోగ యువకులు ఈ పుస్తకాలను వినియోగించుకోవాలి. మొదటినుంచీ తెలంగాణ సాహిత్యాభివృద్ది విషయంలో నమస్తే తెలంగాణ పత్రిక విశేష కృషిని కొనసాగిస్తున్నది. ప్రతి వ్యక్తి జీవితంలో ఎదుర్కొనే అంశాలే కథలుగా వస్తాయి. ప్రతి రచయిత రాసిన కథలన్నీ మంచివే.
– హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్
కథలు సామాజిక అంశాలను స్పృశిస్తాయి
కథలు సామాజిక అంశాలను స్పృశిస్తాయి. ప్రతి కథలో నాగరికత, జీవన విధానం ప్రతిబింబిస్తాయి. ములుకనూరు ప్రజాగ్రంథాలయం అభివృద్ధిలో మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే సతీశ్కుమార్ పాత్ర మరువలేము. అలాగే రచయితలు, సాహితీవేత్తలను ప్రోత్సహించడంలో నమస్తే తెలంగాణ దినపత్రిక మొదటినుంచీ ముందువరుసలో ఉంటోంది. కథలు, ప్రజలను కదిలించి సన్మార్గం వైపు నడిపిస్తాయి. నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. రానున్నరోజుల్లో నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు రావాలని ఆశిస్తున్నా.
– జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్
రెండువేల కథలు వచ్చాయి..
– స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, వేముల శ్రీనివాసులు
నమస్తే తెలంగాణ-ములుకనూరు ప్రజాగ్రంథాలయం ఆధ్వర్యంలో ఇప్పటివరకు మూడు దఫాలుగా జాతీయ తెలుగు కథల పోటీలు నిర్వహించాం. ఈ మూడు దఫాల్లో కలిపి రెండు వేల వరకు కథలు వచ్చాయి. మొదటి సంవత్సరం 25 మందికి, రెండవ సంవత్సరంలో 50మందికి, మూడవ సంవత్సరంలో 65మందికి బహుమతులు ఇచ్చాం. మా గ్రంథాలయాభివృద్ధికి విశేషంగా సహకారాలందించిన అందరికీ కృతజ్ఞతలు. మా సంకల్పానికి నమస్తే తెలంగాణ పత్రిక తోడవ్వడం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తి మున్ముందు కూడా కొనసాగిస్తాం.
భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం
– నమస్తే తెలంగాణ చీఫ్ ఆఫ్ బ్యూరో ఓరుగంటి సతీశ్
సాహిత్యాన్ని రాష్ట్రంలో ప్రోత్సహించే విషయంలో నమస్తే తెలంగాణ పాత్ర ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ములుకనూరు ప్రజా గ్రంథాలయం ఆధ్వర్యంలో భవిష్యత్తులో నిర్వహించే ఏ సాహితీ కార్యక్రమానికైనా మా సహకారాన్ని కొనసాగిస్తాం. ఇదే విధంగా ఏటా కథల పోటీల నిర్వహణ కార్యక్రమానికి తోడుగా నిలుస్తాం. రాష్ట్రంలో సాహితీప్రియులను మొదటినుంచి నమస్తే తెలంగాణ ప్రోత్సహిస్తున్నది.
నూతన రచయితలకు ప్రోత్సాహం
నమస్తే తెలంగాణ, ములుకనూరు ప్రజా గ్రంథాలయం నిర్వహిస్తున్న కథల పోటీలు కొత్త రచయితలను ప్రోత్సహిస్తున్నాయి. బహుమతుల ప్రదానం కూడా మంచి వాతావరణంలో నిర్వహించారు. దీనివల్ల కొత్త రచయితలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల మంచి రచనలు చేస్తూ నిరాదరణకు గురవుతున్న యువ రచయితల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
– మరీదు వేణు, తృతీయ విజేత, ఖమ్మం
రచనలకు ప్రాణం పోస్తున్నారు
కథలు కనుమరుగైపోతున్న తరుణంలో నమస్తే తెలంగాణ, ములుకనూరు ప్రజా గ్రంథాలయం కలిసి అనేక రచనలకు ప్రాణం పోస్తున్న తీరు అభినందనీయం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం. ఈ గ్రంథాలయం స్ఫూర్తితో రాష్ట్రంలో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు జరిగే అవకాశముంది. నమస్తే తెలంగాణ వల్ల అనేక మంది రచయితలు వెలికి వస్తున్నారు.
– సంగనభట్ల నర్సయ్య, రచయిత
ఇదే స్ఫూర్తితో మంచి కథలు రాస్తా
నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం కథల పోటీలు నిర్వహించి, మా లాంటి రచయితలను వెలికితీయడం మంచి నిర్ణయం. ఇందులో నాకు ప్రథమ బహుమతి రావడం ఆనందంగా ఉంది. డిమ్కి కథ న్యాయ నిర్ణేతలకు ఎంతగానో నచ్చిందని చెప్పడం గర్వంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మంచి కథలను రాసి ప్రజల మన్ననలు పొందుతా.
– కందివనం స్ఫూర్తి, ప్రథమ బహుమతి విజేత
సాహిత్యాన్ని వెలికితీయడం మంచి పరిణామం
నేను మోదుగుపువ్వు అనే కథను రాసి నమస్తే తెలంగాణ, ములకనూరు ప్రజా గ్రంథాలయం కథల పోటీకి పంపా. న్యాయ నిర్ణేతలు నా కథను ద్వితీయ విజేతగా ప్రకటించడం సంతోషాన్నిచ్చింది. కథలు రాసి ప్రచురణ కోసం ఎదురుచూసేవాళ్లం. ఇప్పుడు ఇలా నమస్తే తెలంగాణ, ములుకనూరు గ్రంథాలయం వారు మాలోని సాహిత్యాన్ని వెలికితీయడం కోసం పోటీలు నిర్వహించడం మంచి పరిణామం. – తులసిచందు, ద్వితీయ విజేత
కొత్త తరానికి స్ఫూర్తి
ములుకనూరులో నిర్వహించిన కథల పోటీల విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం మంచి ఉత్సాహాన్ని అందించింది. కొత్త తరం వారికి కథలు రాయాలనే ఆసక్తిని పెంపొందించింది. రానున్న రోజుల్లో నమస్తే తెలంగాణ పత్రికతోపాటు ములుకనూరు ప్రజా గ్రంథాలయం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రచయితలకు కొంత ఊతం ఇచ్చినట్లు అవుతుంది.
– నెల్లుట్ల రమాదేవి, తృతీయ విజేత