సిటీబ్యూరో, ఆగస్టు 26 ( నమస్తే తెలంగాణ ) : నగరంలో ఇకపై రాత్రి సమయంలోనూ ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. అత్యధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. రాత్రి వేళ బస్సులు ఉండటం లేదని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విజ్ఞప్తులు రావడంతో అధికారులు నగరంలో 6 రద్దీ రూట్లను ఎంపిక చేశారు. ఈ రూట్లల్లో 24 గంటలు బస్సులు నడిపేలా ప్రణాళికలు చేస్తున్నట్టు వివరించారు.
మరో ఐదు రోజుల్లో 15 బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రూట్ 222ఏ కు 4 బస్సులు (కోఠి నుంచి పటాన్ చెరు), రూట్ నం.218కు 2 బస్సులు (కోఠి నుంచి పటాన్ చెరు ), రూట్నెంబర్ 219 (సికింద్రాబాద్-పటాన్ చెరు), రూట్నం. 290 యూకు 3 బస్సులు (హయత్నగర్-సికింద్రాబాద్), రూట్నం 195కు 3 బస్సులు(బాచుపల్లి -వేవ్ రాక్), రూట్ నం. 10 హెచ్కు 2 బస్సులు (సికింద్రాబాద్-కొండాపూర్) మార్గాల్లో బస్సులు నడపనున్నారు.