హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ మహానగరంలో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)పనులు మరింత వేగవంతం కానున్నాయి. ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 225 కోట్ల నిధులను కేటాయించింది. ఈ ట్విన్ టవర్స్ హైదరాబాద్కు హైకాన్గా మారనున్నాయి. ప్రపంచస్థాయిలో అత్యాధునిక టెక్నాలజీతో ఈ భవనం నిర్మాణమవుతున్నది. ఇందులో కేవలం పోలీసు శాఖకే కాకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఈ భవనం నుంచే సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు సేవలందించనున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి సీసీ కెమెరాలను ఈ సీసీసీకి అనుసంధానం చేయనున్నారు. తాజా బడ్జెట్తో పాటు గత నాలుగేండ్లుగా సీసీసీ నిర్మాణం కోసం బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి. తాజా బడ్జెట్తో పాటు గతంలో కేటాయింపులు కలుపుకుంటే ఇప్పటి వరకు సుమారు రూ. 750 కోట్ల కేటాయింపులు జరిగినట్లు అధికారు లు పేర్కొన్నారు. ఈ భవనాల నిర్మాణాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీ కోసం ఈ నిధులను వెచ్చిస్తున్నారు.