హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో దారుణ హత్య కలకలం రేపింది. రౌడీషీటర్ మహమ్మద్ ఖాజీ సోహెల్ను గుర్తుతెలియని వ్యక్తులు నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేశారు. పల్లెచెరువు సమీపంలోని హయత్ హోటల్ నుంచి దుర్గానగర్ రోడ్డువైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. అలీనగర్కు చెందిన మహమ్మద్ ఖాజీ సోహెల్ (25) బుచ్చర్గా పనిచేస్తున్నాడు. మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్లో అతనిపై రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 2.40 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సోహెల్పై కత్తితో దాడి చేశారు. కడుపు, ఛాతీ వెనుక భాగంలో కత్తిపోట్లు తగలడంతో తీవ్రంగా గాయపడిన సోహెల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. హత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సోహెల్పై గతంలో ఉన్న కేసులు, అతనితో వివాదాలు ఉన్న వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను త్వరలో గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.