హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య పేరిట బోలడన్ని రికార్డులు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక స్థాయిలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య పేరిట ఉంది. ఆయన మొత్తం 16 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దాంట్లో ఆర్థిక మంత్రిగా 15 సార్లు ప్రవేశపెట్టగా.. ఒకసారి సీఎంగా ఆయన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ రికార్డును నెలకొల్పిన నేత కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఎవరూ లేరు.
అసాధారణ ట్యాలెంట్ ఉన్న రాజకీయవేత్తగా రోశయ్యకు గుర్తింపు ఉంది. ఇక ఆయన మాట్లాడితే ఎదుటివారు ఖంగుతినాల్సిందే. అద్భుతమైన మాటకారి అన్న ఐడెంటిటీ కూడా రోశయ్యకు ఉంది. ఛలోక్తులు, చమత్కారాలు వేయడంలోనూ రోశయ్య దిట్ట. నిజానికి గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్ ఫేమస్. కానీ రోశయ్య మాత్రం తాను పనిచేసిన అందరు సీఎంలతో కలిసిమెలిసి ఉన్నారు. చాలా షార్ప్గా లాజిక్గా మాట్లాడుతూ.. అసెంబ్లీలో రోశయ్య సభ్యుల్ని అట్రాక్ట్ చేసేవారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని గట్టెక్కించే సత్తా కలిగిన నేతగా రోశయ్య ఎదిగారు.
ఏపీ బడ్జెట్ను 16 సార్లు ప్రవేశపెట్టిన ఆయన.. ఓ దశలో వరుసగా ఏడు సార్లు బడ్జెట్ను సమర్పించారు. 1980 దశకంలో శాసనమండలి సభ్యుడిగా కొనసాగారు. అయితే 1984లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మండలిని రద్దు చేశారు. మండలిలో రోశయ్యను ఎదుర్కోలేకనే.. ఎన్టీఆర్ మండలిని రద్దు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తుంటాయి. ఉమ్మడి ఏపీ సీఎంగా చేసిన రోశయ్య.. ఇవాళ హైదరాబాద్లో కన్నుమూశారు.