కొండాపూర్, మే 13 : తెలిసిన వాళ్లే కదా అని.. దయ తలచి రేకుల గదులను అద్దెకిస్తే, అదును చూసి ఇంటిని కబ్జా చేశారు. అంతటితో ఆగకుండా దర్జాగా రేకుల గదులను కూల్చి ఇంటి నిర్మాణం సైతం చేపట్టారు. ఇదేంటని ప్రశ్నించిన యజమానిని కబ్జాదారులు చితకబాదారు. ఇదంతా ఎకడో మారుమూల పల్లెలో లేదా ఏజెన్సీ ప్రాంతంలో అనుకుంటే పొరపాటే. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో, హైటెక్ నియోజకవర్గంగా పేరుగాంచిన శేరిలింగంపల్లి సరిల్ కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… ప్రేమ్ నగర్లో కొన్నేళ్లుగా నివాసముంటున్న బాబురావు, అదే కాలనీకి చెందిన కన్నారావు నుంచి 1400 గజాల స్థలాన్ని 1998లో రూ.3,50,000కు కొనుగోలు చేశాడు.
కాగా అందులో 300 గజాల్లో ఉన్న రేకుల గదులను మహానంది సాగర్ అనే వ్యక్తికి అద్దెకిచ్చాడు. కొంతకాలం బాగానే ఉన్న మహానంది సాగర్, బాబు రావు పరిస్థితులను ఆసరాగా తీసుకుని అద్దె ఇవ్వడం మానేశాడు. సదరు ఇంటిని ఖాళీ చేసేందుకు ససేమిరా అంటూ మొండిగా తయారయ్యాడు. బాబురావు వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో సదరు కబ్జాదారుడు ఉంటున్న రేకుల గదులను కూల్చివేసి, ఇంటి నిర్మాణ పనులు చేపట్టాడు. విషయం తెలుసుకున్న బాబురావు అడ్డుకునేందుకు వెళ్తే కుటుంబ సభ్యులతో కలిసి అతన్ని చితకబాదారు. అటువైపు వస్తే చంపేస్తామని బెదిరింపులకు దిగారు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు, మున్సిపల్ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
నిర్మాణాన్ని కూల్చివేయాలని కోర్టు ఆదేశాలు
తనకు జరిగిన అన్యాయంపై బాబు రావు మున్సిపల్ అధికారులతో పాటు కోర్టును ఆశ్రయించాడు. మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందకపోగా.. సదరు స్థలంలో చేపట్టిన నిర్మాణాన్ని సైతం అడ్డుకోలేకపోయారు. దీనిపై కోర్టుకెళ్లిన బాబురావుకు ఊరట లభించింది. సదరు స్థలంలో కొనసాగుతున్న నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశించినప్పటికీ మున్సిపల్ (టౌన్ ప్లానింగ్) అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు అవేదన వ్యక్తం చేస్తున్నాడు.
న్యాయస్థానం ఆదేశాలను సైతం పట్టించుకోకపోతే మాలాంటి పేదలకు ప్రజా పాలనలో న్యాయం ఎకడ దొరుకుతుందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. రేపు మాపు అంటూ లేనిపోని సాకులు చెబుతూ కాలం వెల్లడిస్తున్నారని, పునాదుల సమయంలో ఫిర్యాదు చేస్తే 4 అంతస్తుల నిర్మాణం జరిగినా స్పందించలేదని వాపోయాడు. అధికారుల చుట్టూ తిరిగే ఓపిక, శక్తి తనకు లేదని, సదరు కబ్జాదారుల నుంచి ప్రాణహాని ఉందని అవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇకనైనా టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు స్థలంలో చేపట్టిన నిర్మాణాన్ని వెంటనే కూల్చివేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.