త్వరలో కొత్తగా 10 చోట్ల ఆర్యూబీ, ఆర్వోబీలు
రూ.1230 కోట్లతో చేపట్టనున్న జీహెచ్ఎంసీ
తక్కువ ఖర్చు.. ఎక్కువ ప్రయోజనం ఉండేలా నిర్మాణాలు
డీపీఆర్పై అధ్యయనం చేస్తున్న ఇంజినీరింగ్ విభాగం
సిటీబ్యూరో, జూన్ 13(నమస్తే తెలంగాణ): సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం – జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు నూతన ప్రాజెక్టులను చేపడుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ద్వారా ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఎన్నో ఏళ్లుగా రైల్వే క్రాసింగ్ల వద్ద వాహనదారులు, పాదాచారులు పడుతున్న కష్టాలకు శాశ్వత చెక్ పెట్టాలని తాజాగా నిర్ణయించారు. ఈ మేరకు 10 రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద రూ.1230 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ), రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)లను నిర్మించాలన్న ప్రతిపాదిత ప్రాజెక్టులను కార్యరూపంలోకి తీసుకువచ్చేలా తాజాగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు చర్యలకు ఉపక్రమించారు. 10 చోట్ల రైల్వే శాఖ సమన్వయం చేపట్టనున్న ప్రాజెక్టులకు తొలుత ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు.
ప్రధానంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండేలా ఆర్యూబీలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ మేరకు పలు చోట్ల చేపట్టే ఆర్యూబీలపై టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు భూ సేకరణపై అధ్యయనం చేసి ఇంజనీరింగ్ విభాగానికి నివేదిక అందజేశారు. దీనిపై ఇంజనీరింగ్ విభాగం అధికారులు డిటెల్ట్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) రూపకల్పనపై అధ్యయనం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.