ఉస్మానియా యూనివర్సిటీ : తార్నాక చౌరస్తాలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ పెట్టకోకపోవడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ రమేశ్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం చెంగిచెర్ల ప్రాంతానికి చెందిన కడప కోటేశ్వర్ (55) వృత్తిరీత్యా టైలర్ పని చేసుకుంటాడు.
తన ద్విచక్రవాహనంపై సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వెళ్తుండగా, తార్నాకలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా వెనుకనుంచి వస్తున్న జీహెచ్ఎంసీ చెత్త లారీ ఢీకొట్టింది. చెత్త లారీ లాలాపేట వైపు వెళ్లే క్రమంలో స్కూటీని ఢీకొనడంతో కోటేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
తలకు హెల్మెట్ ధరించని కారణంగానే మృతుడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మరణించాడు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.