దశాబ్దపు ఎదురుచూపులకు తెరపడింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం రెసిడెంట్ వెల్ఫేర్ సంఘాలకు పునర్జీవం పోసింది. ఉమ్మడి రాష్ట్రంలో కమిటీలను నిర్వీర్యం చేసేలా మోకాలు అడ్డుపెడితే… అసోసియేషన్ సంఘాలు కొన్నేండ్లుగా చేస్తున్న పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కొత్త కమిటీల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణ, సభ్యత్వ నమోదు, మౌలిక వసతుల నిర్వహణకు మార్గం సుగమమైంది. దీంతో సిటీలో వందల సంఖ్యలో ఉన్న ఆర్డబ్ల్యూఏలు కార్యకలాపాలు జరుపుకొనే అవకాశం ఏర్పడిందని ఆయా అసోసియేషన్ల ప్రతినిధులు వెల్లడించారు.
రెసిడెంట్ వెల్ఫేర్ సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం పునర్జీవం పోసింది. ఉమ్మడి రాష్ట్రంలో కమిటీలను నిర్వీర్యం చేయగా.. అసోసియేషన్ సంఘాలు గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాయి. వీరి పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో.. కొత్త కమిటీల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణ, సభ్యత్వ నమోదు, మౌలిక వసతుల నిర్వహణకు మార్గం సుగమమైంది. దీంతో నగరంలో వందల సంఖ్యలో ఉన్న ఆర్డబ్ల్యూఏలు కార్యకలాపాలు జరుపుకొనే అవకాశం ఏర్పడిందని ఆయా అసోసియేషన్ల ప్రతినిధులు వెల్లడించారు.
సిటీబ్యూరో, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ) : 2013లో నిర్మాణ సంస్థ, వెల్ఫేర్ కమిటీ మధ్య ఏర్పడిన వివాదంపై ఉన్నత న్యాయ స్థానంలో కేసు నమోదైంది. దీంతో ఆర్డబ్ల్యూఏలకు ఉన్న అధికారాలు, ఆర్థిక లావాదేవీలకు చెక్ పెట్టింది. రెసిడెన్స్ అసోసియేషన్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంతో ఆయా కమిటీల కార్యకలాపాలకు చట్టబద్ధత లేకుండా పోయింది. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న ఎన్నో కమిటీలు కార్యకలాపాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అదేవిధంగా మ్యూచువల్ ఎయిడెడ్ కమిటీలుగా నమోదు చేసుకోవాలని ఆదేశించడంతో నగరంలో 150కి పైగా కమిటీల కార్యకలాపాలు ఆగిపోయాయి.
2019లో హైకోర్టు ఆదేశాలు
2019లో హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న రిజిస్ట్రేషన్ శాఖ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల వార్షిక సాధారణ సమావేశాల నివేదిక, ఖాతాల నిర్వహణ, కమిటీల పునర్ వ్యవస్థీకరణ ఇకపై చెల్లదని జిల్లా రిజిస్ట్రార్లకు సర్క్యూలర్ జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి తెలంగాణలో కమిటీలుగా ఏర్పడిన వాటికి ఎలాంటి అధికారిక హోదా లేకుండా పోయింది. వెల్ఫేర్ కమిటీలు బ్యాంకు ఖాతాలను కూడా నిర్వహించుకునే వీలు లేకుండా పోయింది.
మూడేళ్లుగా పోరాటం…
నగరంలో అధికారిక, అనధికారిక వెల్ఫేర్ కమిటీలు వెయ్యికి పైగా ఉన్నాయి. ఇందులో మెజార్టీ కమిటీలు రెసిడెంట్ సమాఖ్యగా ఏర్పడి కార్యకలాపాలు జరుపుతున్నాయి. కానీ వాటికి ఎలాంటి చట్టబద్ధత లేకపోవడంతో కొన్ని రెసిడెంట్ సొసైటీల సభ్యులు రిజిస్ట్రేషన్ కల్పించాలని మూడేళ్లుగా న్యాయపోరాటం చేస్తూనే ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది బిల్డర్లు ఇదే ఆసరాగా తీసుకొని కమ్యూనిటీలో ఉండే స్థలాల్లో కమర్షియల్ యాక్టివిటీని నిర్వహిస్తూ సొమ్ము చేసుకున్న ఘటనలతో నివాసితులకు, బిల్డర్లకు వివాదాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో సర్వాధికారాలు వెల్ఫేర్ అసోసియేషన్లకు దక్కనున్నాయి.
స్పందించిన సర్కారు
సుదీర్ఘ కాలంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరిపింది. తాజాగా ఈ విషయాన్ని మల్కాజిగిరి బీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. రిజిస్ట్రేషన్లు, ఖాతాల నిర్వహణ నిలిచిపోవడంతో ఏర్పడుతున్న ఇబ్బందులను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్కు వివరించగా రిజిస్ట్రేషన్ శాఖకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీంతో గేటెడ్ కమ్యూనిటీ రిజిస్ట్రేషన్లలో నెలకొన్న ఇబ్బందులు తొలగిపోయాయి.
ఇక మార్గం సుగమం
2013 నుంచి రెసిడెంట్ వెల్ఫేర్ కమిటీలు రిజిస్ట్రేషన్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో తెలుగు రాష్ర్టాల్లో వేలాది కమిటీలు మారిపోయాయి. ముఖ్యంగా కమ్యూనిటీ పరిధిలో చేపట్టే మౌలిక వసతుల అభివృద్ధికి ఆటంకంగా మారడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో కమిటీలు అధికార హక్కులను కోల్పోయాయి. ముఖ్యంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి కమ్యూనిటీ వెల్ఫేర్ల భాగస్వామ్యం అత్యంత అవసరం. ఇలాంటి క్రమంలో ఆయా కమిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేలా ప్రభుత్వం స్పందించడం హర్షణీయం.
– బీటీ శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి, యూఎఫ్ఆర్డబ్ల్యూఏ.
కమ్యూనిటీలతో అభివృద్ధి వేగవంతం
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రెసిడెన్షియల్ వెల్ఫేర్ కమిటీల ద్వారా స్థానికంగా అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది. ఇప్పటివరకు గేటెడ్ కమ్యూనిటీలకు సంక్రమించిన హక్కులకు భంగం వాటిల్లింది. మంత్రి కేటీఆర్, స్పెషల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ చొరవ తీసుకొని కాలనీ సంక్షేమ సంఘాలకు జీవం పోశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో వెల్ఫేర్ కమ్యూనిటీ భాగస్వామ్యంతో మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించింది.
– మర్రి రాజశేఖర్ రెడ్డి,బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి