ప్రేమ్నగర్లో అనధికార కల్లు కాంపౌండ్ ఏర్పాటుపై బస్తీ వాసులు భగ్గుమన్నారు. కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేసే ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరసనకు దిగారు. ఎన్వోసీ లేకుండానే ఎక్సైజ్ శాఖ ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నించారు. బస్తీ మధ్యలో జనావాసాలు, ఆలయాల సమీపంలో కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమన్నారు.
-ఖైరతాబాద్
ఖైరతాబాద్, మే 9 : బంజారాహిల్స్ డివిజన్ ప్రేమ్నగర్లో అనధికార కల్లు కంపౌండ్ ఏర్పాటుపై స్థానిక బస్తీ వాసులు భగ్గుమన్నారు. ఈ మేరకు కల్లు కంపౌండ్ ఏర్పాటు చేసే ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరసనకు దిగారు. పోలీసులు బస్తీవాసులకు నచ్చచెప్పే ప్రయత్నం చేయగా, వారితో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత జేజోల్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ ప్రతిపాదిత కల్లు కంపౌండ్ స్థలం సాయిబాబా ఆలయానికి కేవలం 90 మీటర్ల దూరంలో ఉందని, ప్రతి రోజూ మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తుంటారని తెలిపారు.
ఈ నేపథ్యంలో కల్లు సేవించిన వారితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఎన్వోసీ లేకుండానే ఎక్సైజ్ శాఖ ఎలా అనుమతులు ఇస్తుందని ప్రశ్నించారు. బస్తీ మధ్యలో జనావాసాలు, ఆలయాల సమీపంలో కల్లు కంపౌండ్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమన్నారు. ప్రతిపాదిత కల్లు కంపౌండ్ను తక్షణమే రద్దు చేయాలని లేదా నివాస, ఆధ్యాత్మిక ప్రాంతాలకు దూరంగా తరలించాలని కోరారు. ఈ మేరకు స్థానిక నేతలు శ్రీధర్యాదవ్, నవీన్ కొప్పుల, బస్తీవాసులతో కలిసి ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ కార్యాలయాల్లో ఫిర్యాదులు అందించారు.