బంజారాహిల్స్, మార్చి 18 : ఊబకాయంతో బాధపడుతున్న రోగులకు బేరియాట్రిక్ సర్జరీ పరిష్కార మార్గం చూపుతుందని వైద్యులు తెలిపారు. బంజారాహిల్స్లోని కేర్ దవాఖానలో సోమవారం ఊబకాయంతో బాధపడుతూ బేరియాట్రిక్ చికిత్స పొందిన రోగులతో ‘కేర్ కనెక్ట్’ పేరుతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆస్పత్రి సీవోవో కమ్రాన్ హుస్సేన్ ప్రారంభించి మాట్లాడారు. ఊబకాయంతో బాధపడుతున్న రోగుల్లో మనోనిబ్బరం, శరీర ఆరోగ్యమే ముఖ్యంగా కేర్ కనెక్ట్ను నిర్వహించినట్లు తెలిపారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, మినిమల్ యాక్సెస్ అండ్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. మన దేశంలో ఊబకాయం ప్రాబల్యం నాలుగింట ఒకవంతు ఉన్నదని, ఐదు శాతం మంది అనారోగ్య స్థూలకాయంతో బాధపడుతున్నారన్నారు.
ఈ శాతం మహిళల్లో రెట్టింపు పెరిగిందన్నారు. ఒబెసిటీ అండ్ మెటాబాలిక్ సర్జరీ సొసైటీ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం.. బేరియాట్రిక్ సర్జరీతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజిత్ జైన్, క్లినికల్ డైటీషియన్ సుష్మ, బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న రోగులు దీప్తి నాగలక్ష్మి, షహీదా బేగం, రాజేంద్ర కైతాన్, ఆదుర్తి జాహ్నవి, హర్షారెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.