శేరిలింగంపల్లి, నవంబర్ 6 : రేడియల్ రోడ్డు విస్తరణలో భాగంగా మండల పరిధిలోని గోపన్పల్లితండాలో ఉన్న నిర్మాణాలను రెవెన్యూ, ఆర్ అండ్ బీ అధికారులు కూల్చివేశారు. తెల్లాపూర్ ఔటర్ రింగ్రోడ్డు నుంచి గోపన్పల్లి తండా జంక్షన్ వరకు 100 ఫీట్ల రేడియల్ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యలో అధికారులు శనివారం కూల్చివేతలు చేపట్టారు. గోపన్పల్లి తండా నుంచి ముప్పా బహుళ అంతస్తుల నిర్మాణం వరకు ప్రధాన రహదారికిరువైపుల ఉన్న నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేశారు. చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి తాసిల్దార్ వంశీమోహన్ పర్యవేక్షణలో 36 మంది రెవెన్యూ సిబ్బంది, 200 మంది మాదాపూర్ జోన్ పోలీసులు ఈ కూల్చివేతల్లో పాల్గొన్నారు.
నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచి వెళ్లే వాహనదారుల సౌకర్యార్థం గోపన్పల్లి తండా మీదుగా తెల్లాపూర్ ఔటర్రింగ్ రోడ్డు వరకు ఈ రేడియల్ రోడ్డును ప్రభుత్వం 100 అడుగుల విస్తీర్ణంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది. గోపన్పల్లి తండా జంక్షన్లో వై ఆకారంలో ఫ్లై ఓవర్ నిర్మాణంతో పాటు గోపన్పల్లి తండా జంక్షన్ నుంచి తెల్లాపూర్ వరకు ప్రస్తుతం ఉన్న 80 అడుగుల రోడ్డునకు విస్తరణ పనులు చేపడుతున్నారు. శనివారం ఉదయం 8 జేసీబీలు, 2 హిటాచీలు, 2 కంప్రెషర్ మిషన్లతో కూల్చివేతలు జరిపారు.
గోపన్పల్లి తండా జంక్షన్ నుంచి ముప్పా బహుళ అంతస్తుల నిర్మాణం వరకు 43 భవన నిర్మాణాలు, 15 ఖాళీ ప్లాట్ల స్థలాల్లో వాటిని అధికార యంత్రాంగం కూల్చివేసింది. గోపన్పల్లి ప్రభుత్వ సర్వే నం.34,36లో ఉన్న భవన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. బాధితులకు భవన నిర్మాణాలకు సంబందించి నష్ట పరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. కాగా తమకు ఎలాంటి ముందస్తు సమాచారం, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం సమంజసం కాదని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మాదాపూర్ జోన్ పోలీసులు బందోబస్తు నిర్వహించి పరిస్థితినిఅదుపులోకి తీసుకువచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేడియల్ రహదారుల విస్తీర్ణంలో భాగంగా గోపన్పల్లి తండా నుంచి తెల్లాపూర్ ఔటర్ రింగురోడ్డు వరకు 80 అడుగుల విస్తీర్ణంలో ఉన్న రహదారిని 100 అడుగుల మేరకు విస్తరిస్తున్నట్లు చేవెళ్ల అర్డీవో చంద్రకళ ‘ నమస్తే తెలంగాణ ’ తో పేర్కొన్నారు. ఇందులో భాగంగా 15 మంది ఖాళీ ప్లాట్ స్ధలాలు, 43 మంది భవన నిర్మాణాలు కూల్చివేయడం జరుగుతుందని అన్నారు.
ఇప్పటికే పలుమార్లు బాధితులతో ఈ విషయమై చర్చించామని తెలిపారు. సదరు విస్తరణ స్ధలం ప్రభుత్వ స్థలం కావడంతో నిర్మాణాలకు మాత్రమే నష్టపరిహారం అందజేస్తామన్నారు. 43 మంది భవన నిర్మాణ దారులకు రూ.1.79 కోట్లు నష్ట పరిహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు మాత్రమే ప్రభుత్వం అందించే నష్టపరిహారం తీసుకున్నారని, మిగతా వారు ముందుకు రాలేదని తెలిపారు. అర్హులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈదమ్మ ఆలయం ప్రహరీ, పలు షాపులు కూల్చివేతల్లో పోవడంతో గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఆర్థికసాయం అందించేందకు సిద్ధంగా ఉన్నామని కార్పొరేటర్ గంగాధర్రెడ్డినకు ఆర్డీవో తెలిపారు.