మేడ్చల్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రేషన్ కార్డుల జారీకి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు అర్హుల జాబితాను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో రేషన్ కార్డుల కోసం 51,578 దరఖాస్తులు రాగా.. 90 శాతం పరిశీలన పూర్తి చేసినట్లు అధికారులు ధ్రవీకరించారు. జిల్లాలో 636 రేషన్ దుకాణాలు ఉండగా ప్రస్తుతం 4,94,609 రేషన్ కార్డులు ఉన్నాయి.
రేషన్కార్డుల జారీకి లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నది. నూతనంగా రేషన్ కార్డులు కావాలంటూ 51,578 మంది దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో పరిశీలన పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే పనిలో తహసీల్దార్లు ఉన్నారు. దరఖాస్తుల పరిశీలనను ఎప్పటికప్పడు కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. – పద్మావతి, డీఎస్వో