తెలుగు యూనివర్సిటీ, అక్టోబర్ 25 : దశాబ్దాల అనంతరం ఆకాశంలో అద్భుత ఘట్టం మంగళవారం సాయంత్రం ఆవిష్కృతమైంది. పాక్షికంగానే కనిపించినప్పటికీ ప్రజలు టెలిస్కోప్లు, ఫిలిం గ్లాస్లతో సూర్యగ్రహణాన్ని ఆసక్తిగా తిలకించారు. నగరంలో సాయంత్రం 4.59 నిమిషాలకు ప్రారంభమైన సూర్యగ్రహణం 5.48గంటల వరకు కొనసాగింది.
సుమారు 49నిమిషాల పాటు 43 శాతం సూర్యుడు అస్పష్టంగా కనిపించాడు. ఆదర్శనగర్లో గల బీఎం బిర్లా ప్లానిటోరియం భవనం ఐదవ అంతస్తులో బిర్లా డైరెక్టర్ కేజీ కుమార్ ప్రత్యేకంగా టెలీస్కోప్లు, ప్రత్యేక స్క్రీన్ అమర్చి సూర్యగ్రహణం విశేషాలను సందర్శకులకు వివరించారు. 27 ఏండ్ల తరువాత దీపావళి రోజునే సూర్యగ్రహణం ఏర్పడడం విశేషంగా ప్రజలు భావించారు. ఇదిలా ఉంటే సూర్య గ్రహణం నేపథ్యంలో మంగళవారం ఉదయం బిర్లా టెంపుల్ మూతపడింది. బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం దేవాలయాన్ని తిరిగి తెరిచి భక్తులకు ప్రవేశం కల్పించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.