హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈ ముగింపు వేడుకకు హెచ్పీఎస్ పూర్వ విద్యార్థి, ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసిపోయి రానా సందడి చేశారు.
సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ)/బేగంపేట్ : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) ఓ డ్రీమ్ స్కూల్ అని సినీ నటుడు రానా దగ్గుబాటి అన్నారు. హెచ్పీఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం వేసవి శిక్షణ శిబిరం ముగింపు వేడుకకు ముఖ్యఅతిథిగా హెచ్పీఎస్ పూర్వ విద్యార్థి రానా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక నటుడిగా విద్యార్థుల నృత్యాలు, నటనను తిలకించడం గొప్ప అనుభూతినిచ్చిందని చెప్పారు. సినిమాల పట్ల నా అభిరుచిని తెలుసుకునే అవకాశం హెచ్పీఎస్లో చదవడం వల్లే వచ్చిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో హెచ్పీఎస్ నుంచి వచ్చిన యువతరంతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన లైవ్ ఫుడ్ కౌంటర్లు, ఫైర్లెస్ వంటకాలను తిలకించారు. పానీపూరీని తింటూ ఆస్వాదించారు. వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు మార్గనిర్ధేశనం చేసేందుకు ఒలింపియన్ అలెక్స్ ఆంథోనీ, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ కె.హిందోలా కృషి అద్భుతమని ప్రిన్సిపాల్ అమృత చంద్రరాజు, స్కూల్ ప్రెసిడెంట్ గుస్తీ జె నోరియా పేర్కొన్నారు.