సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రాత్రి 10.30గంటల వరకు నగరంలోని షేక్పేట, బోయిన్పల్లి, సికింద్రాబాద్ మెట్టుగూడలో అత్యధికంగా 1.0సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. ఇతర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిశాయి.
కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజులు నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారి వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా పగలు సమయంలో ఎండలు దంచికొట్టాయి. నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.2డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.8డిగ్రీలు, గాలిలో తేమ 32శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.