దసరా ఇలా అయ్యిందో లేదో నగరంపై వరుణుడు విరుచుకుపడ్డాడు. సరిగ్గా వారం కిందట కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా, శనివారం మళ్లీ కుండపోత కురిసింది. మధ్యాహ్నం 1 గంట నుంచి నాలుగుగంటలపాటు ఏకధాటిగా కురిసిన వానకు నగరం వణికిపోయింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఇప్పటికే నిండిన చెరువుల్లోకి భారీగా ప్రవాహం రావడంతో నాలాలు ఉద్ధృతంగా ప్రవహించాయి.
సరూర్నగర్ చెరువు, ఓయూ సమీపంలో మోహన్ చెరువులు ఉప్పొంగడంతో పీఅండ్టీకాలనీ, కోదండరామ్నగర్, సీసలబస్తీ, అంబర్పేట, పటేల్నగర్, ప్రేమ్నగర్లను వరద చుట్టుముట్టింది. పలు ఇండ్లల్లోకి నీళ్లు చేరడంతో బాధితులను వెంటనే బల్దియా సిబ్బంది పునరావాస శిబిరాలకు తరలించారు. అత్యధికంగా ఎల్బీనగర్ ప్రాంతంలో 10.6 సెం.మీ వర్షపాతం నమోదుకాగా, మేయర్ ఆదేశాలతో మాన్సూన్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రాగల 48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రెండు సంవత్సరాలుగా వరుణుడు గ్రేటర్పై విరుచుకుపడుతున్నాడు. ఒక పక్క కరోనా, మరో పక్క వానతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. సాధారణంగా వర్షాకాలం సీజన్ మొత్తంలో అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు సాధారణ వర్షపాతం 6.21సెం.మీ.లు నమోదు అవుతుంది. గత ఏడాది ఇదే అక్టోబర్ మాసంలో రికార్డు స్థాయిలో 40 సెం.మీల వర్షపాతం నమోదు అయింది.
వందేండ్ల తరువాత గ్రేటర్లో అంత ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ సంవత్సరమూ నగరాన్ని వరుణుడు వదలడం లేదు. ముఖ్యంగా అక్టోబర్ మాసంలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సంవత్సరం అక్టోబర్ 1నుంచి 10వరకు 12.0 సెం.మీల వర్షపాతం నమోదైంది.
సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉన్న మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు తమ పరిధిలో నిలిచిపోయిన వరద నీటిని తొలగించేలా ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తే కాల్ సెంటర్ నం. 040 21111111కు ఫిర్యాదు చేయాలని ఆమె నగరవాసులకు సూచించారు. కంట్రోల్ రూమ్లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.