కీసర, ఫిబ్రవరి 3: కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్ పేర్కొన్నారు. కీసరగుట్టలో జాతర ఏర్పాట్లను శుక్రవారం సీపీ చౌహన్, కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం రమేశ్శర్మతో కలిసి జాతర ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండటంతో పోలీసుశాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పొలీసు అధికారులను ఆదేశించారు.
మహిళలు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం డాక్టర్ల బృందంతో పాటు అంబలెన్స్లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలియజేశారు. భక్తులు పోలీసుశాఖ వారికి సహకరించాలని కోరారు. అనంతరం కీసరగుట్ట ఆలయంలో సీపీ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ డి.జానకి, కీసర ఇన్స్పెక్టర్ రఘువీర్రెడ్డి పాల్గొన్నారు.