సిటీబ్యూరో, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుబిడ్డ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు)కు బుధవారం అపూర్వ స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆమెకు పలువురు ప్రముఖులు, క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీర్యాలీగా ఫిల్మ్నగర్ అంబేద్కర్నగర్ భరణి లేఅవుట్లోని నివాసానికి చేరుకున్నారు.రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పీవీ సింధుకు బొకేలిచ్చి విషెస్ చెప్పారు.వరుసగా రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధు విజయం వెనుక కఠోరశ్రమ దాగి ఉందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
పీవీ సింధు నెయిల్ ఆర్ట్ చూపరులను ఎంతో ఆకట్టుకుంది. ఆమె నెయిల్ పాలిష్, గోళ్లపై ఉన్న ఒలింపిక్స్ లోగో ఆమెకున్న క్రీడాభిమాన్ని చాటినట్లయ్యింది. ఆమె ఎడమచేతి రెండు వేళ్ల గోళ్లపై టాటూ మాదిరి మూడురింగులను అద్దారు. సింధు నెయిల్స్పై ఒలింపిక్ ఆర్ట్ను కెమెరాల్లో బంధించేందుకు అభిమానులు, ఫొటోగ్రాఫర్లు పోటీపడ్డారు. ఈ విజయాన్ని తన అభిమానులకు అం కితం చేస్తున్నట్లు సింధు ఉత్సాహంతో ప్రకటించారు. వచ్చే ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.
ఇంతటితో ముగియలేదు. ఇంకా ముందుంది. ఎన్నో పతకాలు గెలవాలి. 2024లో ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్ పోటీలకు సిద్ధమవుతాను. నాన్న గైడెన్స్ మరువలేనిది. లవ్యూ డాడీ. నాకు ఏ అవసరం ఉన్నా వెంటనే సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి స్పెషల్ థ్యాంక్స్. కాంస్య పతకం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. – పీవీ సింధు