కంటోన్మెంట్లో అడుగు పెట్టకముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రాష్ర్టానికి కేంద్రం ఏ విధంగా ద్రోహం చేసిందనే దానిపై సవివరంగా వివరిస్తూ కంటోన్మెంట్ యూత్ పేరిట ఇరవై ప్రశ్నలతో కూడిన వాల్ పోస్టర్లు బుధవారం ఈస్ట్ మారేడ్పల్లిలో వెలిశాయి. కుత్బుల్లాపూర్లో ముగించుకుని నేడు కంటోన్మెంట్లో అడుగుపెడుతున్న బండి సంజయ్ కేంద్రం నుంచి నిధులు తెచ్చాకే రావాలని ప్రజలు నినదిస్తున్నారు. రాజకీయ పబ్బం కోసమే అబద్ధాలు, ఆరోపణలతో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని గ్రేటర్వాసులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేంద్రం సహకరించకున్నా ఎనిమిదేండ్లలో కంటోన్మెంట్ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే నిలదీతలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 14 (నమస్తే తెలంగాణ)/సికింద్రాబాద్/గాజులరామారం: రాజకీయ పబ్బం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై గ్రేటర్వాసుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. టీఆర్ఎస్ హయాంలో గత ఎనిమిదేండ్లలో జరిగిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే జరిగిన అభివృద్ధి అంతా కేంద్రం నిధులతోనే అంటూ అబద్దాల్ని వల్లిస్తుండటంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది నిజం.., ఏది అబద్ధం.. తెలుసుకో బండి అంటూ నగర యువత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పోస్టులు దర్శనమిచ్చాయి. ఈ క్రమంలో గురువారం బండి పాదయాత్ర సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోకి రానుండటంతో కంటోన్మెంట్ యువత తమ ప్రశ్నలకు సమాధానం చెప్పి బోర్డు పరిధిలో పాదయాత్రకు రావాలంటూ ఫ్లెక్సీలు అంటించారు. ముందుగా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ర్టానికి ఎన్ని నిధులు తెచ్చావో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పాటు బండి పాదయాత్ర ముగిసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనూ ప్రజలు ‘పాదయాత్రతో ఒరిగిందేమీ లేదు’ అంటూ నిట్టూరుస్తున్నారు.
ఇరవై ప్రశ్నలతో కూడిన వాల్ పోస్టర్లు
కంటోన్మెంట్లో అడుగు పెట్టకముందే బండి యాత్రకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రాష్ర్టానికి కేంద్రం ఏ విధంగా ద్రోహం చేసిందనేది సవివరంగా వివరిస్తూ ఇరవై ప్రశ్నలతో కూడిన వాల్ పోస్టర్లు బుధవారం ఈస్ట్ మారేడ్పల్లిలో వెలిశాయి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేశారో చెప్పాలంటూ బీజేపీకి వ్యతిరేకంగా కంటోన్మెంట్ యూత్ పేరిట కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ, బీజేపీని ప్రశ్నిస్తూ ఈస్ట్ మారేడ్పల్లిలోని చెక్పోస్ట్ వద్ద ఉన్న ప్రహరీలపై పోస్టర్లు అంటించారు. ప్రజా సంగ్రామ యాత్ర పోస్టర్ల పక్కనే మోదీ సమాధానం చెప్పాలంటూ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.
అంశాల వారీగా సంధించిన ప్రశ్నలు
కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలు, అమలు కానివి, పెండింగ్ అంశాలను వాల్ పోస్టర్లో ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణకు దక్కాల్సిన ఐటీఐఆర్, మెడికల్ కళాశాలల గురించి కేంద్రాన్ని ఈ పోస్టర్ల ద్వారా ప్రశ్నించారు. వీటితో పాటు కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు, కంటోన్మెంట్ ఎన్నికల అంశం, బయ్యా రం గనుల గురించి ప్రశ్నలు సంధించారు. దీంతో పాటు పసుపు బోర్డు, కంటోన్మెంట్లో ఓటర్ల తొలగింపు, కంటోన్మెంట్ రహదారులు మూసివేత, ప్రాజెక్టులకు జాతీయ హోదాపైనా వాల్ పోస్టర్లో దుయ్యబట్టారు. ఈ అంశాలపై వెంటనే ప్రజలకు సమాధానం చెప్పి, కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలని పోస్టర్ల ద్వారా డిమాండ్ చేశారు. పాదయాత్రల పేరుతో ప్రజాసమస్యలు తీరవని తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యలు తీర్చేందుకే ఉన్నదని పోస్టర్ పైన ముద్రించిన నినాదాలు దర్శనమిస్తున్నాయి.
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే నమ్మేస్తారా..?
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రతో ఒరిగేదేమి లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. స్వార్ధ రాజకీయాల కోసం పార్టీలు మారిన స్థానిక నేతలు మెప్పుకోసం ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి నమ్మించాలని చూశారని ప్రజలు మండిపడుతున్నారు. స్క్రిప్ట్ చదివిన వారికి కండ్ల ముందట జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో 8వేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, ఇప్పటికే 40 వేలకు పైచిలుకు పింఛన్లు లబ్ధిదారులకు అందుతున్నాయని, దీనికి తోడు ప్రతి కాలనీలో సీసీరోడ్లు, డ్రైనేజీతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రతి ఇంటికి ఏదో ఒకరూపంలో సంక్షేమ పథకాన్ని పొందుతున్నామని ప్రజలు తెలిపారు. స్వార్థ రాజకీయం కోసం పాదయాత్ర చేస్తున్న బండి ప్రభుత్వంపై విమర్శలు చేసి నమ్మించే ప్రయత్నం చేశారని ప్రజలు చెప్పుకుంటున్నారు.
ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావ్
కంటోన్మెంట్ ఏడో వార్డు పరిధిలోని తిరుమలగిరిలో పేదలు శుభకార్యాలు, వివాహాలు చేసుకునేందుకు వీలుగా అందరికీ అందుబాటులో కమ్యూనిటీ హాలు ఉండేది. దానిని తొలగించి పక్కనే డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడంతో నిత్యం వాసన భరించలేక నరకం చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకొని కంటోన్మెంట్లో అడుగుపెడుతున్నావు. మేము ఏండ్ల నుంచి భరిస్తున్న కంపును ముందు తొలగించి పాదయాత్ర చేసుకో.
– సోమయ్య, తిరుమలగిరి
కంటోన్మెంట్కు కేంద్రం చేసిందేమిలేదు
కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో కొనసాగుతున్న కంటోన్మెంట్కు బీజేపీ ప్రభుత్వం చేసిందేమిలేదు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో కంటోన్మెంట్లో చేపట్టనున్న పాదయాత్ర ద్వారా ప్రజలకు చేకూరే ప్రయోజనం ఏమిటో చెప్పాలి. అభివృద్ధి విషయంలో చెప్పుకునేందుకు ఒక్క పనైనా కేంద్ర ప్రభుత్వం చేసినట్లు చూపెట్టి పాదయాత్ర చేపడితే బాగుంటుంది.
– వై.కృష్ణ, రసూల్పూరా
రాష్ట్ర ప్రభుత్వ పథకాలతోనే లబ్ధి
కంటోన్మెంట్ నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ ఇక్కడ అమలయ్యే పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానియే. అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళిత బంధు, పెన్షన్ల వంటి ప్రతి పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కేంద్ర చేసిందేమిలేదు.
– కృష్ణవేణి, రెజిమెంటల్బజార్
మోకాళ్ల యాత్ర చేసినా బీజేపీ ఎదగదు
ఎన్నో ఏండ్ల నుండి తిరుమలగిరి మలానీ ఎంక్లేవ్ చెరువు కాలుష్యభరితంగా మారింది. నిత్యం దోమలు, వర్షాకాలంలో ఇండ్లలోకి వరద నీరు చేరి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. చెరువు పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తుంది. కంటోన్మెంట్లో నీ పాదయాత్రతో చెరువుల సమస్యను పరిష్కరించి చూపించు. బండి మోకాళ్ల యాత్ర చేసినా దండగే.
– సత్యనారాయణ గౌడ్, తిరుమలగిరి
గతంలో ఈపనులుఎందుకు చేయలేదు
గతంలో అధికారంలో ఉండి, నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు ఇన్ని పనులు ఎందుకు చేయలేదు. ఇప్పుడిప్పుడే మా సమస్యలు పరిష్కారం అవుతున్న తరుణంలో తిరిగి కొత్త రంగు పూసుకొని లేనివి ఉన్నట్లు.. ఉన్నవి లేన్నట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటు.
– వీరేశం, జగద్గిరిగుట్ట
రోడ్లు మూసివేసి పాదయాత్ర .. సిగ్గుచేటు
బొల్లారం లకాడావాలా రోడ్డు, హోళీ ట్రినిటీ చర్చి రోడ్డు, అమ్ముగూడ రోడ్డు మూసివేతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు పరిష్కరించకుండా బండి ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో కంటోన్మెంట్లో పాదయాత్ర చేయడం సిగ్గుచేటు. మూసివేసిన రోడ్లు తెరిపించి పాదయాత్ర చేయి.
– అమర్ రాజు, బొల్లారం
100 కోట్లు ఇప్పిస్తాడా..?
కంటోన్మెంట్కు రూ.800 కోట్లు బకాయిలు ఉన్నాయి. బొల్లారంలో ఉన్న ఎల్ఆర్ఎంజీ జూనియర్ కళాశాలలో భవనం శిథిలావస్థకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బండి సంజయ్ పాదయాత్ర చేసి 100 కోట్లు ఇప్పిస్తాడా.?
– ఈఆర్ బాల్రాజు, ఆదర్శనగర్, బొల్లారం