ఎంత కష్టపడి అయినా సరే.. మనకంటూ ఓ ఇల్లు కట్టుకోవాలన్నదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష. అలాంటి వారికి ట్రెడా ప్రాపర్టీ షో చక్కని వేదికగా నిలుస్తున్నది. మాదాపూర్ హైటెక్స్లో శుక్రవారం ఈ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ఒకే వేదికపై వందలాది హౌసింగ్ ప్రాజెక్టులు. అందులోనే ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, అపార్టుమెంట్లు ఇలా రకరకాల ప్రాజెక్టులు. 100కుపైగా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్. మరో 100కు పైగా డెవలపర్లు, స్టేక్ హోల్డర్లు తమ ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. అలాగే… పలు రియల్ ఎస్టేట్ సంస్థలు, వెండర్లు, రుణ సౌకర్యం కల్పించే బ్యాంకులతో పాటు ఫైనాన్షియల్ సంస్థలు ఈ షోలో పాలుపంచుకున్నాయి.
కేంద్రం ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకానికి నగరానికి చెందిన వీ హబ్ ఫౌండేషన్ ఎంపికైంది. ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీ హబ్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పెట్టుబడి లేకపోయినా మంచి ఆలోచనలు ఉంటే చాలు వారిని వివిధ రంగాలను కేంద్రంగా చేసుకొని నూతన వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు వీ హబ్ చర్యలు చేపట్టింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం నుంచి రూ.70 లక్షలను వీ హబ్కు కేటాయించనున్నారు. మహిళలు ఏర్పాటు చేసే స్టార్టప్ కంపెనీలకు అవసరమైన నిధులను సమకూర్చి, వారు తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఈ నిధులను వెచ్చించే అవకాశం కలగనుంది.
హైటెక్స్ వేదికగా నిర్వహిస్తున్న ట్రెడా ప్రాపర్టీ షో శని, ఆదివారాల్లోనూ కొనసాగనున్నది. మొత్తం రెండు హాల్స్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోలో కొనుగోలుదారులు ఒకేచోట తమకు నచ్చిన ప్రాపర్టీస్తో పాటు అవసరమైన గృహ రుణాలను పొందేందుకు బ్యాంకుల ప్రతినిధులు కూడా అందుబాటులో ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేసి, సమగ్ర సమాచారంతోపాటు కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
ప్రాపర్టీ నచ్చితే వెంటనే రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. గృహ రుణాల వడ్డీ ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. 6.5 శాతం వడ్డీతో ఉద్యోగులు, వ్యాపారస్తులు రుణాలు పొందవచ్చు. వారం,పది రోజుల వ్యవధిలోనే ప్రాసెసింగ్ పూర్తిచేసి గృహ రుణాలు మంజూరు చేస్తాం. కరోనా సమయంలోనూ గృహ రుణాలు తీసుకునే వారి సంఖ్య చాలా పెరిగింది. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుండడంతో కొనుగోళ్లు బాగానే ఉన్నాయి.సాయికుమార్, ఏరియా సేల్స్ మేనేజర్ , కొటక్ బ్యాంకు హౌసింగ్ లోన్స్
నగరవాసుల్లో చాలా మంది ఓఆర్ఆర్ చుట్టూ భూములను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. నగరంలో ఇప్పటికే సొంతంగా ఇండ్లు ఉన్న వాళ్లయితే రెండో ఇంటిని విశాలంగా, గేటెడ్ కమ్యూనిటీలో కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కొనుగోలు దారుల అభిరుచులను బట్టే ప్రాజెక్టులు చేపడుతున్నాం. మా సంస్థ శ్రీశైలం హైవే, శంకర్పల్లి, షాద్నగర్ ప్రాంతాల్లో ప్లాట్లు, విల్లా ప్రాజెక్టులను చేపట్టింది.- జి.శ్రీనివాస్, మార్కెటింగ్ డైరెక్టర్, సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్
దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారింది. పెట్టుబడుల రాకతో ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. దాంతో ఇండ్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరగడం, అదే సమయంలో ఆఫీస్ స్పేస్ సైతం ఎక్కువగా అవసరం అవుతున్నది. కరోనా తర్వాత కొన్ని నగరాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ధరలు తగ్గడం, స్థిరంగా ఉంటే… హైదరాబాద్లో మాత్రం పెరుగుదల కనిపించింది. ఇక్కడ రెసిడెన్షియల్ మార్కెట్ చాలా బలంగా ఉంది. లక్షలాది మంది సొంతింటిని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. – శ్యాంసన్ ఆర్థర్, సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్,నైట్ ఫ్రాంక్
కరోనా తర్వాత దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ తీవ్ర ఒడిదుడులకు గురైంది. చాలా మెట్రో నగరాల్లో ఇప్పటికీ బిల్డర్లు, డెవలపర్లు ఇబ్బందులు పడుతున్నారు. కానీ.. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా స్థిరంగా ఉంది. కరోనా తర్వాత సైతం పలు ప్రాంతాల్లో ధరలు పెరిగాయే తప్ప, తగ్గలేదు. కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్లోనే కాదు…తెలంగాణ వ్యాప్తంగా బాగుంది. కొత్తగా ఐటీ 2వ పాలసీని ప్రకటించి చాలా ఉన్నతమైన లక్ష్యాలను ప్రభుత్వం పెట్టుకోవడం వల్ల పెట్టుబడులతోపాటు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. – సునీల్ చంద్రారెడ్డి, సెక్రటరీ జనరల్, ట్రెడా