Hyderabad | ఉప్పల్, ఫిబ్రవరి 29 : పాపులారిటీ, రాజకీయ ప్రయోజనం కోసం ఓ వ్యక్తి తనపై హత్యాయత్నం జరిగినట్లు డ్రామా ఆడాడు. స్నేహితులతో కలిసి ప్రణాళిక రచించి.. మీడియాలో వైరల్ చేసుకొని..చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఉప్పల్ పోలీస్స్టేషన్లో గురువారం మల్కాజిగిరి డీసీపీ పద్మజ వివరాలు వెల్లడించారు. బోడుప్పల్కు చెందిన ఎల్లగొని ఉదయ్భాస్కర్(43)కు పలు వ్యాపారాలు ఉన్నాయి. పలు పోలీస్స్టేషన్లలో కేసులు, రౌడీషీట్ కూడా ఉంది. అయితే పాపులారిటీ, రాజకీయ ప్రయోజనాల కోసం.. హత్యాయత్నం డ్రామా ఆడాలని ప్లాన్ వేశాడు. ఈ విషయాన్ని స్నేహితులతో కలిసి చర్చించాడు. ఈ క్రమంలో రూ. 2.5 లక్షలతో ఒప్పందం కుదిరింది.
50వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఉప్పల్ భగాయత్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఉదయ్భాస్కర్ కాలభైరవ ఆలయానికి వచ్చి పూజలు చేస్తుంటాడు. ఈ ప్రాంతంలో అటాక్ అయితే బాగుంటుందని భావించారు. ప్లాన్ అమల్లో భాగంగా ఈ నెల 24న కారులో వస్తున్న ఉదయ్భాస్కర్ను మాస్కులు ధరించిన వ్యక్తులు అడ్డగించారు. కారు అద్దాలు పగలగొట్టి..కత్తితో దాడి చేశారు. ఉదయ్భాస్కర్ తనపై హత్యాయత్నం జరిగినట్లు వైరల్ చేసుకొని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో అదంతా ఫేక్ అని తేల్చిన పోలీసులు.. ఉదయ్భాస్కర్ను, అతడికి సహకరించిన శివకిశోర్(33), యాదగిరి(38), అరుణ్(35), సృజన్రెడ్డి(30), ప్రశాంత్(28)లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు సంతోష్రెడ్డి, మహేశ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాహనాలు, డబ్బులు సీజ్ చేశామన్నారు.