ఎర్రగడ్డ : పేదల సంక్షేమమే ధ్యేయంగా లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలుపర్చుతున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ ఛత్రపతి శివాజీనగర్లో 125 మంది లబ్దిదారులకు ఇండ్ల పొజిషన్ సర్టిఫికెట్లను సోమవారం ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ అనతి కాలంలోనే పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను అమలుపర్చటానికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆసక్తిని కనబర్చుతున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
దశాబ్ద కాలంపాటు ఛత్రపతి శివాజీనగర్ వాసుల కల నేడు నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను, ప్రభుత్వాన్ని పని కట్టుకుని విమర్శించే విపక్షాలు ఇకనైనా కళ్లు తెరిచి వాస్తవాలను తెలుసుకోవాలని హితవు చెప్పారు. కేవలం ఎన్నికల సమయంలో హామీలు గుప్పించే పార్టీలకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్బేగం, బాలానగర్ తహశీల్దార్ కృష్ణయ్య, ఆర్ఐ గాయత్రి, మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ, పల్లవి మహేందర్యాదవ్, షరీఫ్ఖురేషీ, కల్యాణి, గంట మల్లేష్, పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.