బడంగ్పేట, ఆగస్టు 9 : మీర్పేట పెద్ద చెరువు పర్యాటక ప్రాంతంగా మారబోతుంది. మినీ ట్యాంక్ బండ్గా తయారు చేయాలని, అందుకు సంబంధించిన మ్యాప్ను అధికారులు రూపొందించారు. మీర్పేట పెద్దచెరువు సర్వే నెంబర్ 61లోని 12.89 ఎకరాల్లో సుందరీకరణ చేయడానికి అధికారులు స్థలం కేటాయించారు. ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు నూతన హంగులతో చెరువులను సుందరీకరణ చేయడానికి రంగం సిద్ధం చేశారు. చెరువు సుందరీకరణకు ప్రభుత్వం హెచ్ఎండీఏ నుంచి రూ.7 కోట్లు నిధులు కేటాయించింది. రేపు (ఈనెల 11) పెద్ద చెరువు సుందరీకరణ పనులకు మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. చెరువులోకి మురుగు నీరు రాకుండా రూ.23 కోట్లతో ట్రంక్ లైన్ ఏర్పాటు చేశారు. దీంతో చెరువులోకి వర్షం నీరు మాత్రమే వచ్చే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. చెరువు కట్టపై నూతన హంగులతో కట్టకు ఇరువైపులా లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయనున్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటుతో పాటు పాదచారులకు ప్రత్యేక గ్యాలరీతోపాటు బీమ్ బారియర్, రైలింగ్ ఏర్పాటు చేయనున్నారు.
ఆరు నెలల్లో పెద్ద చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే పెద్ద చెరువు రూపురేఖలు మార్చుతారన్న విషయం తెలియడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువు సుందరీకరణ ఎలా చేయాలన్న అంశాలపై విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పలు మార్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీంతో మీర్పేట పెద్ద చెరువుకు కొత్త కళ రానుంది.
బాలాపూర్ మండలంలో ఉన్న చెరువులను దశల వారీగా సుందరీకరణ చేయిస్తాం. చెరువుల సుందరీకరణకు అవసరం అయిన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుంది. ప్రస్తుతం సందచెరువు, మంతాల్ర చెరువు, పోచ్చమ్మ కుంట, కోమటి కుంటలను సుందరీకరణ చేస్తాం. నాదర్గుల్లో ఉన్న సున్నం చెరువు, బాలాపూర్ పెద్ద చెరువుల సుందరీకరణకు నిధులు కేటాయించాం. భవిష్యత్ తరాల కోసం చెరువులను కాపాడాల్సిన అవసరం ఉంది. చెరువుల అభివృద్ధికి సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు.
-మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మూడు చెరువులను సుందరీకరణ చేయిస్తున్న మంత్రి సబితాఇంద్రారెడ్డికి రుణపడి ఉంటాం. మురుగు నీటి చెరువులను మంచి నీటి చెరువులుగా మార్చబోతున్నారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మీర్పేటకు మంచి రోజులు వచ్చాయి. -డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి
చెరువులను సుందరీకరణ చేయడం వలన ప్రజల కు ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా కబ్జాలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. చెరువు చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చెరువులోకి మురుగు నీరు పోకుండా చేశాం. 12.89 ఎకరాల్లో సుందరీకరణ చేయడం జరుగుతుంది. మిగిలిన స్థలంలో ప్రజలకు అవసరం అయిన సౌకర్యాలు కల్పిస్తాం. -తాసిల్దార్, మీర్పేట ఇంచార్జీకమిషనర్ డి.శ్రీనివాస్రెడ్డి