భాగ్యనగరానికి వన్నె తెస్తున్న చెరువులను సంరక్షించడమే కాకుండా, నగరవాసులకు ఆహ్లాదం పంచేందుకు ప్రభుత్వం సుందరీకరణ పనులు చేపడుతోంది. ఓ వైపు ఆక్రమణలను నిలువరిస్తూనే మరోవైపు అభివృద్ధి పనులను చకచకా పూర్తి చేస్తున్నది. గ్రేటర్ పరిధిలో 185 చెరువులను గుర్తించి.. రూ.94.17 కోట్ల వ్యయంతో తొలుత 63 చెరువుల రూపురేఖలు మార్చుతున్నది. సర్కారు స్ఫూర్తిని అందుకున్న పలు కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా (సీఎస్ఆర్-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) మేము సైతం అంటూ చెరువుల సంరక్షణకు ముందుకొచ్చాయి. సొంత నిధులు వెచ్చించి గ్రేటర్ వ్యాప్తంగా పది చెరువులను అభివృద్ధి చేయడంతోపాటు వాటిని సుందరీకరించే పనిలో నిమగ్నమయ్యాయి. కొన్నిచోట్ల పనులు పూర్తి చేసి పర్యాటకులకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచుతుండగా, మరికొన్నిచోట్ల చురుగ్గా సాగుతున్నాయి. సంస్థల సామాజిక బాధ్యత చెరువులను పరిరక్షించడంతోపాటు ఆవాసాలను వరద ముంచెత్తకుండా కాపాడుతున్నది.
సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): నిన్నటి దాకా ఆ నీటి వనరులు అభివృద్ధి పేరిట కబ్జా కోరల్లో చిక్కుకుపోయాయి. ఆక్రమణదారుల చేతుల్లో చిక్కి కాలగర్భంలోనూ కలిసిపోయిన దాఖలాలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి వనరులు పునర్జీవనాన్ని పొందుతున్నాయి. ఇందులో భాగంగా సర్కారు స్ఫూర్తిని అందుకున్న కొన్ని కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా (సీఎస్ఆర్-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) చెరువుల అభివృద్ధిని భుజాన వేసుకున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ సంస్థలు పది చెరువుల అభివృద్ధి-సుందీకరణకు ముందుకు వచ్చాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టింది. ఇందుకుగాను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొంతకాలంగా బృహత్తర ప్రక్రియను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలో 185 చెరువులను గుర్తించింది. సర్వే ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఇందులో ఐదు మినహా మిగిలిన చెరువులన్నింటికీ ఎఫ్టీఎల్ను నిర్ధారించడంతో పాటు వాటికి సంబంధించిన మ్యాపులను కూడా రూపొందించింది. ఇందులో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ను కూడా భాగస్వామిగా చేర్చింది.
ఎఫ్టీఎల్ నిర్ధారణతో పాటు మ్యాపుల రూపకల్పన బాధ్యతను హెచ్ఎండీఏ చేపట్టింది. అయితే మ్యాపులు రూపొందించిన 150 చెరువులకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాల స్వీకరణ.. తుదుపరి ప్రక్రియల అనంతరం ఇటీవల 50 చెరువులకు సంబంధించిన తుది నోటిఫికేషన్ కూడా జారీ అయింది. తద్వారా ఆయా చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్ పరిధిలో ఏయే సర్వే నంబర్లు వస్తాయనేది అధికారికంగా వెల్లడైంది.
దీంతో ఇకపై చెరువుల ఎఫ్టీఎల్లో ఆక్రమణలు జరగకుండా అన్నిరకాల శాఖల అధికారుల్లోనూ ఒక స్పష్టత వచ్చింది. అయితే జీహెచ్ఎంసీ ఇప్పటికే 63 చెరువులకు రూ.94.17 కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్నది. దీంతో పాటు చెరువుల్లో మురుగు కలవకుండా ఉండటంతో పాటు సుందరీకరణ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద 19 చెరువుల అభివృద్ధికి రూ.279.78 కోట్ల నిధులకు కూడా మంజూరు చేసింది.
హైదరాబాద్ మహా నగరంలో కీలకమైన పర్యాటక ప్రాంతంగా దుర్గం చెరువును ప్రభుత్వం అభివృద్ధి చేసింది. తీగల వంతెనతో పాటు చెరువు సుందరీకరణ పూర్తి చేసింది. దీంతో కె.రహేజా ఐటీ పార్కు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చి.. సీఎస్ఆర్ కింద పలు పనులు చేపట్టే బాధ్యతను తీసుకుంది. 2.20 కిలోమీటర్ల మేర వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేసింది. రెండో దశలోనూ చేపట్టిన ట్రాక్ల నిర్మాణ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి.
అపర్ణ ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఈ చెరువు అభివృద్ధికి ముందుకొచ్చింది. ఇన్లెట్, అవుట్లెట్ నిర్మాణల పునరుద్ధరణ ఇప్పటికే పూర్తయింది. బండ్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. చెరువులో గుర్రపు డెక్క, ఇతర చెత్తను తొలగించడంతో పాటు పూడికతీత పనులు కూడా చేపట్టింది. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మొక్కలు నాటింది. దీంతో చెరువు చుట్టూ పచ్చదనం పెరిగింది. ఇంకా ప్లాంటేషన్తో పాటు వెట్లాండ్ పాండ్స్ పనులు పురోగతిలో ఉన్నాయి.
ఖాజాగూడలోని పెద్ద చెరువు అభివృద్ధి బాధ్యతను సీఎస్ఆర్ కింద వెల్స్
ఫార్గో ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ తీసుకుంది. చెరువులో పిచ్చి మొక్కలు, గుర్రపుడెక్క, చెత్త తొలగింపు పనులు పూర్తయ్యాయి. బండ్ పునరుద్ధరణ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్లాంటేషన్ పనులు కూడా కొనసాగుతున్నాయి.
సాహే ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ చెరువు చుట్టూ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపును చేపట్టింది. చెరువులోకి మురుగు చేరకుండా ఉండేందుకు కూడా ఈ కంపెనీ పనులు చేపట్టింది.
నానక్రాంగూడలోని మోడి కుంట అభివృద్ధిని ఫోనిక్స్ కంపెనీ తీసుకుంది. చెరువు క్లీనింగ్ పనులు కొనసాగుతున్నాయి.
మూసాపేటలోని కాముని చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో క్లీనింగ్ పనులు, బండ్ నిర్మాణ పనుల బాధ్యతను సైబర్ సిటీ బిల్డర్స్ తీసుకుంది.
హఫీజ్పేటలోని మీదికుంట అభివృద్ధిని బాధ్యతగా తీసుకున్న ఫౌంటేయిన్ హెడ్ స్కూల్ ఇప్పటికే క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. బండ్ నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
ఖానామెట్లోని మొండికుంట అభివృద్ధి బాధ్యతను హక్సగాన్ అనే కంపెనీ తీసుకుంది. సీఎస్ఆర్ కింద చేపడుతున్న పూడికతీత పనులు పురోగతిలో ఉన్నాయి. బండ్ నిర్మాణం, క్లీనింగ్ పనులు
కొనసాగుతున్నాయి.
గచ్చిబౌలిలోని బర్లకుంట అభివృద్ధిని జీపీ మోర్గాన్ కంపెనీ తీసుకుంది. పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. బండ్ నిర్మాణ పనులతో పాటు చెరువు క్లీనింగ్ ప్రక్రియ పురోగతిలో ఉంది. చెరువులోకి మురుగు రాకుండా ఉండేందుకు చేపట్టిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
నల్లగండ్లలోని పెద్ద చెరువు అభివృద్ధి బాధ్యతను అపర్ణ ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ తీసుకుంది. ఎఫ్టీఎల్ పరిధిలో చెత్త, పిచ్చి మొక్కల తొలగింపు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. చెరువు అభివృద్ధి ప్రణాళిక ఎలా ఉండాలనే రూపకల్పన ప్రస్తుతం కొనసాగుతుంది.
గ్రేటర్ పరిధిలో ఒకవైపు ప్రభుత్వపరంగా జరుగుతున్న చెరువుల అభివృద్ధితో స్ఫూర్తి పొందిన పలు కార్పొరేట్ సంస్థలు తమ సొంత నిధులతో పలు చెరువులను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద పది చెరువుల అభివృద్ధి పనులు ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి.