బంజారాహిల్స్,ఏప్రిల్ 27 : బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సైట్-2కు చెందిన బి.ఏడుకొండలు(40) అనే వ్యక్తి బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని కృష్ణానగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం రాత్రి ఆ ఇంటిపై దాడులు చేశారు.
అక్కడ పేకాడుతున్న నిర్వాహకుడు ఏడుకొండలుతో పాటు వెంకటగిరికి చెందిన టైలర్ మహ్మద్ సలీం(45), షేక్ సిరాజ్(30,డి.ఉదయ్(29), ఏ సురేష్(30),ఎం.వర్మ (27) తదితరులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వీరి వద్దనుంచి రూ.61,780 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.