ఎనిమిదవ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీఖాన్ ముకర్రం ఝా అంత్యక్రియలు బుధవారం అధికారలాంఛనాలతో జరిగాయి. చౌమహల్లా ప్యాలెస్ నుంచి వేలాది మంది అభిమానులు వెంటరాగా ముకర్రం ఝా కోరిక మేరకు ఆయన పార్థివ దేహాన్ని మక్కా మసీదులో అసఫ్జాహీ రాజుల సమాధుల చెంత ఖననం చేశారు. అంతకుముందు పలువురు రాజకీయ, ఇతర ప్రముఖలు నివాళులు అర్పించారు.
రాజకీయ, ప్రముఖుల నివాళి
చార్మినార్, జనవరి 18: టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో మృతి చెందిన ఎనిమిదో నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీఖాన్ ముకర్రం ఝా అంత్యక్రియలు జరిగాయి. అసఫ్ జాహి సమాధుల వద్ద బుధవారం ఖననం చేశారు. మంగళవారం సాయంత్రం నగరానికి చేరుకున్న ముకర్రం ఝా పార్థివ దేహాన్ని స్థానికులు, ఇతరులు సందర్శించేందుకు అనుగుణంగా నిజాం హయాంలో సెక్రటరియట్గా కొనసాగిన చౌమహల్లా ప్యాలెస్లో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య అందుబాటులో ఉంచారు. బుధవారం ఉదయం నుంచి వివిధ పార్టీల నేతలతోపాటు వ్యాపారస్తులు, స్థానికులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 8వ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ మృతదేహానికి నివాళులర్పించారు.
వేలాది మంది..
బుధవారం ఉదయం నుంచి రెండు ప్రవేశ ద్వారాల ద్వారా నిజాం పార్థివ దేహాన్ని సందర్శించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. చౌమహల్లా ప్యాలెస్ ప్రధాన ద్వారం క్లాక్ టవర్ నుంచి రాజకీయ ప్రముఖులతోపాటు నిజాం కుటుంబ సభ్యులు, వారి బంధువులకు ప్రవేశాన్ని కల్పించారు. సాధారణ మార్గం నుంచి స్థానికులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులను అనుమతిస్తూ నిజాం పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు వీలు కల్పించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి 8వ నిజాం ముకర్రం ఝాను కడసారి చూసేందుకు వేలాదిగా ఆయన అభిమానులు తరలివచ్చారు. అనంతరం అంత్యక్రియల కోసం చౌమహల్లా ప్యాలెస్ నుంచి ప్రభుత్వ లాంఛనాలతో ముకర్రం ఝా పార్థివదేహాన్ని వేలాది మంది ప్రజల మధ్య అసఫ్ జాహీ సమాధులు ఉన్న మక్కా మసీదుకు తరలించారు.
భారీ బందోబస్తు..
నిజాం అంత్యక్రియల సందర్భంగా దక్షిణ మండల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రధాన మార్గంతోపాటు అంతర్గత రహదారుల వద్ద బలగాలను మోహరించారు. దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య ఎప్పుడికప్పుడు బందోబస్తును పరిశీలిస్తూ.. సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
అధికారిక లాంఛనాలతో..
మక్కా మసీదులో హోం మంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సాయంత్రం నమాజీ జనాజాలో పాల్గొని, అంత్యక్రియల సన్నాహకాల్లో పాలుపంచుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ముకర్రం ఝా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించారు. హోం మంత్రి మహమూద్ అలీ స్వయంగా పర్యవేక్షించారు. పోలీసు శాఖలోని బ్యాండ్ బృందం 8వ నిజాంకు ఘన నివాళి అర్పిస్తూ ప్రత్యేక సంగీతాన్ని ఆలపించింది. అనంతరం గౌరవ సూచకంగా గాల్లో కాల్పులు జరిపి సంతాపాన్ని తెలియజేశారు. ముకర్రం ఝా పార్థివ దేహాన్ని అసఫ్ జాహీ సమాధుల చెంత ఆయన కోరిక మేరకు ఖననం చేశారు.