శేరిలింగంపల్లి, జనవరి 11: డెలివరీ బాయ్ అవతారమెత్తి ఇండ్లల్లో దొంగతనాలు చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ జి.వినీత్ నిందితుడి వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బబ్బడి అభిలాష్ (29) బీటెక్ మధ్యలో ఆపేసి నగరానికి వచ్చాడు.
కేపీహెచ్బీ కాలనీలోని హెచ్ఎంటీ హిల్స్లో నివాసం ఉంటూ తాళం ఉన్న ఇండ్లను టార్గెట్ చేశాడు. డెలివరీ బాయ్గా పగటి పూట కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లపై రెక్కీ నిర్వహిస్తున్నాడు. రాత్రి సమయంలో ఆ ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తాళం, కిటికీ గ్రిల్స్ను కత్తిరించేందుకు బాలానగర్లో ఓ స్టీల్ బోల్టు కట్టర్ను కొనుగోలు చేశాడు. కట్టర్ సహాయంతో సులువుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
20 కేసుల్లో నిందితుడు..
రెండేండ్లుగా చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 7, మియాపూర్ పీఎస్ పరిధిలో 7, గచ్చిబౌలి పరిధిలో 4, కేపీహెచ్బీ పీఎస్ పరిధిలో 2 నేరాలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో ఆయా పోలీస్స్టేషన్లలో నిందితుడు అభిలాష్పై కేసులు నమోదయ్యాయి. మియాపూర్ పోలీసులు ఆర్టీసీ కాలనీలో నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. అతడి వద్ద నుంచి మొత్తం రూ. 16 లక్షల విలువజేసే 26 తులాల బంగారు ఆభరణాలు, 300 గ్రాముల వెండి, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పీడీ యాక్టు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తామని డీసీపీ వినీత్ తెలిపారు. ఈ సమావేశంలో మాదాపూర్ అడిషనల్ డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, మియాపూర్ ఏసీపీ నర్సింహారావు, సీఐ ప్రేమ్కుమార్లు పాల్గొన్నారు.