మన్సూరాబాద్, సెప్టెంబర్ 14: అదనపు కట్నం కోసం భార్య గొంతు కోసి హత్య చేసేందుకు యత్నించిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలతో దవాఖానలో చేరిన సదరు మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటన నాగోల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మక్భూల్ జానీ కథనం ప్రకారం.. హయత్నగర్, బొమ్మలగుడి ప్రాంతానికి చెందిన ఊపుటల్లి వేణుగోపాల్తో మహలక్ష్మి (19)కి ఏడాది క్రితం వివాహం జరిగింది. వేణుగోపాల్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. పెళ్లి సమయంలో 15 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు కట్నం కింద ఇచ్చారు. వేణుగోపాల్కు తన తండ్రి వెంకటేశ్వర్లు మధ్య గొడవలు తలెత్తడంతో కొన్ని రోజుల క్రితం వేణుగోపాల్ ఇల్లు వదిలాడు. ప్రస్తుతం భార్యతో కలిసి నాగోల్, లక్ష్మీనరసింహా కాలనీలో నివాసముంటున్నాడు.
మద్యానికి బానిసగా మారిన వేణుగోపాల్.. మహాలక్ష్మికి తెలియకుండా ఆమె బంగారు నగలు కొన్నింటిని అమ్మేశాడు. విషయం గ్రహించిన ఆమె మిగిలిన బంగారు నగలను తన తల్లిదండ్రుల వద్ద పెట్టింది. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడుతూ డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేసి కొట్టేవాడు. దీంతో పాటు కొందరు మహిళలతో చాటింగ్ చేసే వాడు. మహిళలతో చాటింగ్ విషయంపై ప్రశ్నిస్తే కొట్టి రోడ్డుపైకి గెంటేసేవాడు. భర్త వేధింపులు తాళలేక జూలై మాసంలో మహలక్ష్మీ నాగోల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భార్యాభర్తలు ఇద్దరిని పోలీసులు కౌన్సిలింగ్ సెంటర్కు పంపి రాజీ కుదిర్చారు. కాగా ఆదివారం ఉదయం 10 గంటలకు బంధువుల గృహ ప్రవేశం ఉండటంతో తనతో రావాలని భార్య మహలక్ష్మీ, భర్త వేణుగోపాల్ను కోరింది. నేను రానంటూ బిగ్గరగా అరుస్తూ ఆమెపై దాడికి పాల్పడి.. తన వద్ద ఉన్న పేపర్ కటింగ్ బ్లేడ్తో మహలక్ష్మి గొంతు కోశాడు.
అడ్డుకునే ప్రయత్నంలో ఆమె చిటికెన వేలు తెగిపోయింది. ఒకవైపు గొంతు భాగం నుంచి తీవ్ర రక్తస్రావం జరుగుతుండగా భర్తను తోసేసి రోడ్డుపైకి పరుగెత్తుకుంటూ వెచ్చి కేకలు వేసింది. దీంతో స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం మహాలక్ష్మిని నాగోల్లోని సుప్రజ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహాలక్ష్మీ ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భార్యను హతమార్చేందుకు యత్నించిన వేణుగోపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి గొంతు కోసేందుకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.