సిటీబ్యూరో, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): మహా నగరంలో వాతావరణం ప్రస్తుతం రోగాల వ్యాప్తికి అనుకూలంగా ఉంది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. శిశు సంరక్షణలో భాగంగా ప్రభుత్వం ఖరీదైన టీకాలను సైతం పూర్తి ఉచితంగా అందజేస్తోంది. ప్రధానంగా చిన్న పిల్లల్లో అధికంగా వచ్చే న్యూమోనియాను అరికట్టడానికి న్యూమోకోకల్ టీకా అత్యవసరం. ప్రైవేటులో రూ.12 వేలకు లభ్యమయ్యే ఈ టీకాను ప్రభుత్వం పూర్తి ఉచితంగా ఇస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంటి పిల్లల తల్లిదండ్రులతో పాటు పిల్లల వైద్య నిపుణులు సైతం ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఖరీదైన టీకాలను ఆర్ధిక స్థోమత గలవారు మాత్రమే తమ బిడ్డలకు ఇప్పించేవారు. అవి సర్కార్ దవాఖానాల్లో అందుబాటులో ఉండేవి కాదు. కాని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిరుపేదల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రం ఆరోగ్యంగా ఉండాలంటే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రధానంగా శిశు మరణాలను తగ్గించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పేట్ల బుర్జు, గాంధీ, నిలోఫర్ తదితర ప్రసూతి దవాఖానల్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, ప్రత్యేక ఐసీయూ వార్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టిన ప్రభుత్వం రెండు నెలల క్రితం న్యూమోకోకల్ టీకాను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
పిల్లల్లో న్యూమోనియా, శ్వాస కోశ సంబంధ వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కుగా ఉంటాయి. శిశు మరణాలలో ఎక్కువగా న్యూమోనియా బాధిత శిశువులే ఉంటున్నారు. దీనిని అరికట్టి శిశు మరణాలను మరింత తగ్గించేందుకే ఈ న్యూమోకోకల్ టీకాను అందుబాటులోకి తీసుకువచ్చింది. రెండు నెలల క్రితం వరకు ఈ టీకా కేవలం కార్పొరేట్ దవాఖానాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. టీకా ఖరీదైనది కావడంతో నిరుపేదలు, మధ్య స్థాయి వర్గాల ప్రజలు న్యూమోకోకల్కు దూరంగా ఉండేవారు. దీని వల్ల ప్రధానంగా నవజాత శిశువులు, ఏడాది లోపు, మూడేళ్ళలోపు పిల్లలు అధికంగా న్యూమోనియా బారిన పడేవారు. వీరిలో కొంత మంది సకాలంలో గుర్తించక సమస్య తీవ్రమై మృత్యువాత పడేవారు. ప్రస్తుతం, ఈ టీకాను గ్రేటర్లోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి ఉచితంగా ఇస్తుండటంతో శిశువులకు న్యుమోనియా తదితర శ్వాస కోశ వ్యాధుల గండం తప్పినైట్లెంది.
నగరంలోని 154 ఆరోగ్య కేంద్రాలలో న్యూమోకోకల్ టీకాను శిశువులకు పూర్తి ఉచితంగా వేస్తున్నారు. ఆగస్టు 18న ప్రారంభమైన న్యూమోకోకల్ టీకాకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రభుత్వ దవాఖానాల్లో జన్మించిన ప్రతి శిశువుకు పూర్తి ఉచితంగానే న్యూమోకోకల్ టీకాను వేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. వీరితో పాటు ఇతర దవాఖానాల్లో జన్మించిన శిశువులకు సైతం టీకాను ఉచితంగానే పంపిణీ చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. టీకా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 7,752 మంది చిన్నారులకు టీకా వేసినట్లు అధికారులు తెలిపారు.