కుత్బుల్లాపూర్, అక్టోబర్7: బంకుల్లో మైక్రో చిప్ అమర్చి..మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను ఎస్వోటీ, బాలానగర్ పోలీసులు అరెస్టు చేశారు. పెట్రోల్ యంత్రంలో చూపించే రీడింగ్ పాయింట్స్ ఒక్కొక్కటిగా జంప్ అవుతూ.. చివరకు తక్కువగా ఇంధనం పోసే.. సాప్ట్వేర్ను రూపొందించిన ఈ గ్యాంగ్.. ఏకంగా బంక్ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకొని.. దందా కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది. సైబరాబాద్ పరిధిలోని బాలానగర్ జోన్ డీసీపీ పద్మజ తెలిపిన వివరాల ప్రకారం…జగద్గిరిగుట్టకు చెందిన ఎండీ ఫయాజుల్(46), అల్వాల్కు చెందిన కురడె సందీప్(38), బండ్లగూడకు చెందిన ఎండీ అస్లాం(29),యాదాద్రి భువనగిరి జిల్లా లింగరాజ్పల్లి గ్రామానికి చెందిన కలిమెర నర్సింగరావు(32) గతంలో పెట్రోల్ బంక్లో పనిచేసి మానేశారు. ముఠాగా ఏర్పడి.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు ప్లాన్ వేశారు. రాజస్థాన్లోని సూరజ్ అనే వ్యక్తి రూపొందించిన ఓ సాప్ట్వేర్ చిప్ను తీసుకొని.. మరింత అభివృద్ధి చేశారు.
బంక్ల నిర్వాహకులకు ఎరగా వేశారు. యంత్రాన్ని ట్యాంపరింగ్ చేసి అందులో మైక్రో చిప్ పెట్టి మోసం చేస్తున్నారు. లీటర్కు 30 ఎంఎల్, 50 ఎంఎల్ వరకు తక్కువ వచ్చేలా ప్రోగ్రాం తయారు చేశారు. ఈ చిప్ను రూ. లక్ష నుంచి రెండు లక్షల వరకు బంక్ డీలర్లకు అమ్మకాలు చేశారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ర్టాల్లోని ఇప్పటికే 34 బంక్లలో మైక్రో చిప్లను అమర్చారు. ఇలా వచ్చిన డబ్బులను ఒప్పందం ప్రకారం పంచుకుంటారు.
విశ్వసనీయ సమాచారం మేరకు లీగల్ మెట్రాలజీ అధికారులతో పాటు సైబరాబాద్ ఎస్వోటీ డీసీపీ సందీప్, ఎస్వోటీ బాలానగర్ ఇన్స్పెక్టర్ జేమ్స్బాబు, జీడిమెట్ల, మేడ్చల్ పోలీసులు రంగంలోకి దిగి ఈ నలుగురు నిందితులను పట్టుకున్నారు. వారిని నుంచి బంక్ రీడింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ ముఠాపై జీడిమెట్ల, మైలార్దేవ్పల్లి, మేడ్చల్, జవహర్నగర్ పోలీస్స్టేషన్లో ఆరు కేసులు నమోదై ఉన్నాయి. నిందితులతో పాటు పెట్రోల్ బంక్ డీలర్లు, యజమానులు హకీంపేట టీఎస్ఆర్టీసీ నిర్వాహకుడు వంశీధర్రెడ్డి, పూడుర్ మేడ్చల్ హరిహర ఫిల్లింగ్స్టేషన్ నిర్వాహకుడు రమేశ్, మైలార్దేవ్పల్లి జీఎంఆర్ ఫిల్లింగ్ స్టేషన్ సూపర్వైజర్ బీరవెల్లి మహేశ్వర్, జీడిమెట్లలోని లక్ష్మి గణేశ్ బంక్ నిర్వాహకుడు నాగండ్ల వెంకటేశ్లపై కేసు నమోదు చేశారు.