సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ): మహానగర నిర్మాణంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మహోన్నత పాత్ర పోషిస్తున్నది. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా చేపడుతూ.. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వచ్చేందుకు దోహదం చేశాయి.
ఐటీ రంగంలోనే కాకుండా రియల్ ఎస్టేట్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, డేటా సెంటర్స్ వంటి వాటిల్లో వేల కోట్ల పెట్టుబడులు నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో వచ్చాయి. నగర భవిష్యత్తును మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేలా ఎన్నో ప్రాజెక్టులను, అత్యాధునిక మౌలిక వసతులను కల్పించారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్ఎండీఏ కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేందుకు టెండర్లు పిలవడం లేదు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల పనులను కొనసాగించడం లేదు. నిత్యం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలంటూ సచివాలయం, బుద్ధ పూర్ణిమ అథారిటీ కార్యాలయం, అమీర్పేటలో స్వర్ణజయంతి కమర్షియల్ కాంప్లెక్సులోని హెచ్ఎండీఏ కార్యాలయాలకే అధికార యంత్రాంగమంతా పరిమితమైంది.
ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళికా విభాగాల్లో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. ప్రతిపాదిత ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, పనుల్లో చలనం లేదు. శివారు ప్రాంతాల్లో హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన లే అవుట్లలో మౌలిక వసతుల కల్పన, రోడ్లు, ఫ్లై ఓవర్ల వంటి నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40 రోజులు గడిచినా.. క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టులపై దృష్టి సారించడం లేదు.
ప్రస్తుతం హెచ్ఎండీఏ కమిషనర్గా ఉన్న దానకిశోర్, అత్యంత కీలకమైన పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్నారు. సచివాలయంలోనే ఆయన బిజీగా ఉండడంతో హెచ్ఎండీఏకు సంబంధించిన కార్యకలాపాలపై ఎక్కువగా దృష్టి సారించకపోవడమే కాకుండా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నది. ప్రధానంగా హెచ్ఎండీఏలో అత్యంత కీలకమైన ఇంజినీరింగ్, ప్లానింగ్ విభాగాల పరిధిలో జరగాల్సిన పనుల్లో సరైన పురోగతి లేదనే ఆరోపణలు ఉన్నాయి.