చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యలు
ఆత్మహత్య యత్నానికి ముందర ప్రవర్తనలో మార్పు
గుర్తించి ప్రాణాలు కాపాడాలంటున్న సైకాలజిస్టులు
దేశంలోని 30 మంది ప్రముఖ డిజైనర్లలో ఒకరైన ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. బయటకు ఆమె జీవితం పూలసౌధం.సెలబ్రెటీలతో సావాసం.. కోరుకున్నట్టుగా జీవించగలిగే స్థోమత.. మరి చచ్చిపోయెంత బాధ ఏమొచ్చింది? అని ప్రతి ఒక్కరూ ఆలోచించారు. తన సూసైడ్ నోట్లో..‘నేను కోరుకున్న జీవితం ఇది కాదు. ఒంటరి జీవితంతో విరక్తి చెందా. తల్లిదండ్రులకు భారం కాలేను, నన్ను క్షమించండి.’ అంటూ పేర్కొంది.
‘కష్టపడి చదివాడు. సైట్ ఇంజనీర్గా ఉద్యోగం సాధించాడు. మంచి జీతంతో సాఫీగా సాగుతున్న సమయంలో గచ్చిబౌలికి చెందిన యువ ఇంజనీర్ వెంకట్ రావు (27) హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. ‘నాజీవితంలో ఒక కఠిన నిర్ణయం తీసుకుంటున్నాను..’ అని చనిపోయే ముందర వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు. ఆ మెస్సేజ్ చూసి బంధువులు, స్నేహితులు అతడికి ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయలేదు. చేసే పరిస్థితిలోనూ లేడు.
ఇలా ఎందరో తమ విలువైన ప్రాణాలను క్షణికావేశంలో తెంచేసుకుంటున్నారు. కారణాలు ఏమైనా చనిపోవాలనే ఆలోచన సరైనది కాదని వాళ్లు గుర్తించడం లేదు. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని.. అది గుర్తించే క్రమంలో కొంత ఆలస్యం అవుతుందని.. అంతమాత్రానికే ప్రాణాలు తీసుకోవడం హేయమైన చర్య అని సైకాలజిస్టులు చెప్పారు. ఆలోచనలు పాజిటివ్గా సాగాలని సూచించారు.
సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్ప డి తమ కుటుంబాలకు తీరని శోఖాన్ని అందిస్తున్నారు. ఆత్మహత్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో), ఎన్సీఆర్బీ(నేషనల్ క్రైం రికార్డు బ్యూరో) వెలువరించే లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒక వ్యక్తి ప్రాణాలు తీసుకోగా, దేశంలో ప్రతి గంటకు ఒక విద్యార్థి సూసైడ్ చేసుకుంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మెదడులో రసాయనిక సమతుల్యత లేకపోవడం కూడా ఆత్మహత్యకు కారణమవుతోందని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. న్యూరో ట్రాన్స్మీటర్స్ లేక న్యూరో కెమికల్స్ మెదడులో చురుకుగా లేకపోవడం వల్ల సమస్య తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఒంటరితనం..వివాహ సంబంధాల కారణాలు, వరకట్న వేధింపులు, వివాహేతర సంబంధాలు, విడాకులు తీసుకున్నవారు.. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు.. కుటుంబ, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు.. ఆత్మీయులు చనిపోయిన బాధతో.. ప్రేమ సంబంధ కారణాలు.. భూ వివాదాలు తదితర కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారని నివేదికలు వెల్లడించాయి. అయితే మన చుట్టూ ఉండేవాళ్లు ఎలాంటి ఇబ్బందులతో సతమతమవుతారో మనకు తెలిసే అవకాశం కొంతైనా ఉంటుంది. అలాంటి సమయంలో వారికి మనం బాసటగా ఉంటే.. వారు ఆత్మహత్య బారిన పడకుండా రక్షించిన వాళ్లమవుతామని సైకియాట్రిస్టులు చెబుతున్నారు.
ఒత్తిడే ప్రధాన శత్రువు
డిప్రెషన్తోనే చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. భరోసా లేకపోవడం.. ఇష్టమైన వారిని కోల్పోవడం.. ఎలాంటి సహాయం అందకపోవడం తదితర కారణాలు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రేకెత్తిస్తాయి. మీ చుట్టూ ఉండే వారిని గమనిస్తూ ఉండాలి. తెలిసినవాళ్లు వారి సమస్యలను చెబుతున్నప్పుడూ శ్రద్ధగా వినాలి. వారి కష్టాలు చాలా చిన్నవి లాగా వారిని మోటివేట్ చేయాలి. ఎలా బయటకి రావాలో వారికి చెప్పాలి. ఆ సమయంలో మనం అశ్రద్ధ చేస్తే వాళ్లు భయానక నిర్ణయాల వైపునకు వెళ్లే అవకాశం ఉంటుంది.
– కవితపాన్యం, సైకాలజిస్టు
గుర్తిద్దాం.. ప్రాణాలు నిలబెడుదాం
ఒత్తిడి, అశాంతి, భయం, అభద్రత, నిరాశ, తదితర మానసిక కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఓటమి, అవమానం భరించలేక కొందరు ఆత్మహత్యకు యత్నిస్తున్నారు. ఆత్మహత్య చేసుకునే సమయానికి వ్యక్తి పరిస్థితి పరిశీలిస్తే మెదడులో సెరాటోనిన్ అనే రసాయనిక ద్రవం పూర్తిగా తగ్గిపోతుంది. తీవ్రమైన బాధతో కనిపిస్తారు. ఐకోటిక్స్ లక్షణాల వలన ఆత్మహత్య చేసుకోవాలనే స్థితిలోకి వెళ్లిపోతారు. వారిని గుర్తించి అండగా ఉంటే ప్రాణాలను కాపాడినవాళ్లమవుతాం.
– శివ, సైకాలజిస్టు.